
కొమురవెల్లిలో దొంగతనం
బంగారం, వెండి, రూ. 50 వేలు అపహరణ
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఏఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన పోతుగంటి కొమురెల్లికి రెండు ఇళ్లు ఉన్నాయి. అతను పాత ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి వెనుకాల ఉన్న గేట్లో నుంచి దూకి కొత్త ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. తాళాలతో బీరువాను తెరిచి సుమారు ఐదు తులాల బంగారు, 22 తులాల వెండి అభరణాలు, రూ.50వేలు అపహరించారు. దీంతో బాధితుడు పోలీసలకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్టీంతో వివరాలు సేకరించారు.
లద్నూరులో చోరీకి యత్నం
మద్దూరు(హుస్నాబాద్): దొంగలు చోరీకి యత్నించి గ్రామంలో తచ్చాడుతూ పట్టుబడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన గడ్డం పద్మ బుధవారం ఉదయం 8 గంటలకు ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. తిరిగి 10గంటలకు కుమారుడితో కలిసి వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దొంగలు పడ్డారని గ్రహించి వెతకగా.. గ్రామ శివారులోని దుర్గమ్మ ఆల యం వద్ద ఏడుగురు మహిళలు, ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంబడించి ప్రశ్నించగా ముగ్గురు పరారయ్యారు. మిగిలిన ఐదుగురిని గ్రామస్తులతో కలిసి పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించి, పోలీసులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. కాగా ఇప్పటికే వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు తెలిపారు.
పార్కు చేసిన ఆటో చోరీ
నర్సాపూర్: ఇంటి ముందు పార్కు చేసిన ఆటో మంగళవారం రాత్రి నర్సాపూర్లో చోరీకి గురైంది. ఆటో యజమాని అశోక్ వివరాల ప్రకారం.. ఆటో అవసరం ఉందని తన మిత్రుడు సమీర్ అడగడంతో అతనికి ఇచ్చాడు. సమీర్ తన పనులు పూర్తి చేసుకుని రాత్రి నర్సాపూర్లోని షాదీఖానా ఏరియాలోని తన ఇంటి ముందు పార్కు చేశాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆటోను దొంగిలించాడు. చోరీ జరిగిన తర్వాత తూప్రాన్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చోరీ విషయమై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లగా తూప్రాన్ లో సీసీ కెమెరాలు పరిశీలించాల్సి ఉంటుందని చెప్పగా తాను అక్కడికి వెళ్లి ఆటో వివరాలు అందచేశానని అశోక్ తెలిపారు. ఫిర్యాదు తర్వాత తీసుకుంటామని పోలీసులు చెప్పారని బాధితుడు పేర్కొన్నాడు.
ఇప్పలకుంట సమీపంలో కాలిన మృతదేహం
హత్నూర(సంగారెడ్డి): గుర్తు తెలియని కాలిన మృతదేహం కనిపించింది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని కాసాల గ్రామ శివారులో ఇప్పలకుంట సమీపంలో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల గల వ్యక్తి కాల్చివేసి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి ఒంటిపై గ్రే కలర్ జీన్ పాయింట్ వేసుకొని ఉన్నాడు. కుడిచేతికి వెండి కడియం ఉంది. వివరాలు తెలిస్తే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు.
అక్రమ ఇసుక
వాహనం పట్టివేత
కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని వింజపల్లి గ్రామ శివారులో గల మోయతుమ్మెద వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ సిబ్బంది కొమురయ్య పట్టుకున్నారు. వివరాలు ఇలా... వింజపల్లి గ్రామం నుంచి చిన్నకోడూరు మండలానికి అక్రమంగా ఇసుకను తీసుకువెళ్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో గ్రామంలోకి వెళ్లి చూడగా ఎలాంటి అనుమతులు లేకుండా బొలెరో వాహనంలో ఇసుకను తరలిస్తున్నారు. వాహనాన్ని పట్టుకొని తహసీల్దార్ అహ్మద్కు అప్పగించారు.

కొమురవెల్లిలో దొంగతనం