
కేతకీలో అమావాస్య పూజలు
తరలివచ్చిన భక్తజనం
ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. అమావాస్యను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పవిత్ర పుణ్యస్నానాలు చేసి, గుండంలోని జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రాతః కాల పూజ నిర్వహించి భక్తులకు దర్శనం ప్రారంభించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రత్యేక పూజలు
భక్తులు స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, హారతి, కేశఖండనంతోపాటు తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలోని బలభీముని ఆలయం, నాగులకట్ట, పోగడ చెట్టు, నవగ్రహాలతోపాటు తదితర ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కేతకీలో అమావాస్య పూజలు