
లేబర్ కోడ్ తెస్తే తిరుగుబాటు తప్పదు
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య
పటాన్చెరు టౌన్: లేబర్ కోడ్ తీసుకొస్తే తిరుగుబాటు తప్పదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య హెచ్చరించారు. శనివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రామిక భవన్లో జరిగిన పార్లే ఆగ్రో పరిశ్రమ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు వస్తే బానిసలుగా మారడం తప్పదన్నారు. కార్యక్రమంలో సంతోష్ కుమార్, రాజశేఖర్ సుజిత్, సుధాకర్, శ్రీకాంత్, కిరణ్, రాములు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యల
పరిష్కారం మాతోనే సాధ్యం
ఐఎన్టీయూసీ జిల్లా
అధ్యక్షుడు నరసింహారెడ్డి
పటాన్చెరు టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం ఐఎన్టీయూసీతోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. శనివారం ఐఎన్టీయూసీ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐఎన్టీయూసీ మూడు కోట్ల 30 లక్షల మంది కార్మికులు సభ్యత్వం ఉన్న అతిపెద్ద కార్మిక సంఘమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక పక్షపాతి అని, వారికి కార్మిక వర్గం అండగా ఉంటుందన్నారు. కార్మిక నాయకులు విజయ్, రాజశేఖర్ రెడ్డి, కుమార్, ప్రదీప్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.
అధిక సాంద్రతతో
అధిక దిగుబడులు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్
ఝరాసంగం(జహీరాబాద్): అధిక సాంద్రత విధానంతో పంటలు అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఝరాసంగం రైతు వేదికలో అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పత్తి సాగులో తాజా మార్పులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ ఎకరా విస్తీర్ణంలో ఎక్కువ విత్తనాలు వేసి తక్కువ దూరంతో సాగు చేస్తే దిగుబడి బాగా వస్తుందన్నారు. బయోచార్ ఎరువులో అధిక పోషకాలు నీటిని నిలిపే సామర్థ్యం పెంచుతుందన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి, మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్, అరణ్య సంస్థ ప్రతినిధి పద్మ, నూజివీడు సీడ్స్ ప్రతినిధి నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఖైదీలకు ఉచితన్యాయ సేవలు అందిస్తాం
జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: జైలులోని ఖైదీలకు సరైన వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శనివారం కందిలోని సెంట్రల్ జైలును ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖైదీలకు సరైన వసతులు కల్పించాలని, సమయానికి బెయిల్, ములాఖత్ అందించాలన్నారు. ఖైదీల కోసం కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం జైలు అధికారులతో, ఖైదీలతో మాట్లాడారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు.

లేబర్ కోడ్ తెస్తే తిరుగుబాటు తప్పదు