
అంగన్వాడీల బలోపేతం
జవాబుదారీకోసం ట్యాబ్లు
నారాయణఖేడ్: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ పైమరీ ప్రారంభించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉండడం, దీనికి తోడు కనీస సౌకర్యాల లేమితో అంగన్వాడీలు కొనసాగుతుండడంతో వాటిపై దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలు కల్పించాని సంకల్పించింది. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు అక్షరజ్ఞానం నేర్పుతున్నారు. దీనితోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్య సలహాలు అందజేస్తున్నారు. కానీ కేంద్రాలు కనీస మౌలిక సదుపాయాలు లేక కొట్టుమిట్టాడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రానున్న విద్యా సంవత్సరం లోపు కనీస సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. పక్కా భవనాలు లేని కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించనున్నారు.
అలాగే.. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట్, సదాశివపేట్, పటాన్చెరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 1,04,106 మంది చిన్నారులు కేంద్రాలకు వస్తున్నారు. జిల్లాలో 359 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా వాటిలో కొన్ని పక్కా భవనాలు కాగా మరికొన్ని పాఠశాల, పంచాయతీ భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు అన్ని కేంద్రాల్లోనూ మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలన్నింటినీ ఒక్కో కేంద్రానికి రూ.లక్ష ఖర్చుతో కల్పించనున్నారు.
పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు
ఒక్కో కేంద్రానికి రూ.లక్ష కేటాయింపు
సదుపాయాలు కల్పిస్తున్నాం
మౌలిక సదుపాయాలు లేని కేంద్రాల వివరాలు తయారు చేసి కలెక్టర్కు సమర్పించనున్నాం. వచ్చే అకాడమిక్లోగా మౌలిక సదుపాయాల కల్పన జరగనుంది. అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల సెలవులు ప్రకటించారు. కేంద్రాల్లో భోజనం వండడం జరగదు. నేరుగా చిన్నారులు, లబ్దిదారుల ఇళ్ళకే నెలకు సరిపడా సరుకులను అందజేస్తాం. సెలవు రోజుల్లో టీచర్లు, ఆయాలు రిపోర్టులు సమర్పించడం, ఫీల్డ్ వర్క్, పిల్లల సర్వే చేపట్టడం జరుగుతుంది.
– లలితకుమారి,
జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్, సంగారెడ్డి
అంగన్వాడీ టీచర్లు ఇదివరకు మొబైల్ ఫోన్లు సఫరా చేశారు. తక్కువ సామర్థ్యం ఉన్న ఫోన్లు కావడంతో వాటిద్వారా వివరాల నమోదు ఇబ్బందికరంగా మారింది. దీన్ని నివారించేందుకు వారికి 5జీ నెట్వర్క్గల ట్యాబ్లను ఇవ్వనున్నారు. ఒక్కో ట్యాబ్కు రూ.20వేలను ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ ట్యాబ్ల ద్వారానే టీచర్లు, విద్యార్థులు, గర్భిణిలు, బాలింతల రోజు వారీ హాజరు, సరుకు రవాణా, చిన్నారుల బరువు, ఎత్తు, ఆరోగ్య సమచారం నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా జవాబుదారీ తనం పెరుగుతుందని భావిస్తున్నారు.

అంగన్వాడీల బలోపేతం