
ప్రత్యేక శిబిరం.. ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం
నర్సాపూర్ రూరల్: మండలంలోని అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ ప్రత్యేక శ్రద్ధతో వేసవి శిబిరం నిర్వహిస్తున్నాడు. 24 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో తన పాఠశాలలో చదువుకుంటున్న పేద మధ్య తరగతి పిల్లలను ప్రైవేటు పాఠశాలలు దీటుగా చదివించాలన్న లక్ష్యంతో తానే చొరవ తీసుకొని ఈ శిబిరాన్ని ప్రారంభించాడు. సుమారు 40 మంది విద్యార్థులు ఈ శిబిరానికి హాజరవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. శిబిరంలో గణితం, ఇంగ్లిష్, తెలుగు, చేతి రాతతో పాటు సంస్కతీ సాంప్రదాయాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. వేసవి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు రావడంతో ఇతర ఉపాధ్యాయులు వారి వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. హెచ్ఎం లక్ష్మీనారాయణ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా శిబిరం కొనసాగిస్తున్నాడు. విద్యార్థులు సైతం శ్రద్ధతో శిబిరానికి వచ్చి శిక్షణ పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సేవలు అభినందనీయం: ఎంఈఓ తారా సింగ్
అచ్చంపేట పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ సేవలు అభినందనీయం. విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ శిబిరాన్ని పలుమార్లు సందర్శించాను. ఇతర ఉపాధ్యాయులు సైతం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది.
ప్రైవేటుకు దీటుగా విద్య : లక్ష్మీనారాయణ
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన కల్పించాలన్న లక్ష్యంతోనే అచ్చంపేట పాఠశాలలో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాను. అచ్చంపేట గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ఉండేందుకు గణితం, ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతి సాంప్రదాయాల శిక్షణ ఇవ్వడంతోపాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని ఈ శిబిరంలో వెలికి తీసి వారిని ప్రయోజకులను చేసేందుకు కృషి చేస్తున్నా. ఆట, పాటలు, డ్రాయింగ్, ఉపన్యాస, వ్యాస రచన, క్విజ్, జనరల్ నాలెడ్జ్ లో సైతం శిక్షణ ఇస్తున్నాం.
అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహణ
గణితం, ఇంగ్లిష్, తెలుగు చేతి రాతతోపాటు సంస్కృతి సంప్రదాయాలపై శిక్షణ
హెచ్ఎం లక్ష్మీనారాయణను అభినందిస్తున్న గ్రామస్తులు

ప్రత్యేక శిబిరం.. ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం