కందుకూరు: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అణచివేత రాజకీయాలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి విమర్శించారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కోసం టీఆర్ఎస్ చేపట్టిన ఉప్పల్ భగాయత్ కార్యక్రమానికి వెళ్లకుండా గురువారం ఉదయమే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూడడమేనన్నారు. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ సీఎం రేవంత్రెడ్డి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ పేరుతో కాలయాపన చేయడం తప్ప ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమకారుల ఆవేదనపై గళమెత్తితే సంకెళ్లు వేసి భయభ్రాంతులకు గురిచేస్తారా అని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


