సేవలు అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

సేవలు అంతంతే..

Jun 24 2025 7:37 AM | Updated on Jun 24 2025 7:37 AM

సేవలు

సేవలు అంతంతే..

సర్కారు ఆస్పత్రులు సమస్యలు బోలెడు
● సమయపాలన పాటించని వైద్యులు ● అత్యవసర పరిస్థితుల్లో స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు, ఆయాలే దిక్కు ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● బాధితులకు తప్పని తిప్పలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యపు జబ్బు పట్టి పీడిస్తోంది. మందుల కొరత.. మౌలిక సదుపాయాల లేమి.. వెరసి అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రులకు చేరుకున్న నిరుపేద రోగులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. ఉదయం 9 గంటలకే ఓపీలో కూర్చోవాల్సిన వైద్యులు 11 దాటినా కన్పించడం లేదు. కొన్ని చోట్ల ఎక్సరే మిషన్లు పని చేయడం లేదు. రేడియాలజిస్టులు లేకపోవడంతో అల్ట్రాసౌండ్‌ మిషన్లు పనికిరాకుండా పోతున్నాయి. టెక్నీషియన్ల కొరతతో డయాలసిస్‌ సేవలు అందడం లేదు. వ్యాధి నిర్దారణ కోసం బాధితుల నుంచి రక్త, మూత్ర పరీక్షల నమూనాలు సేకరించినప్పటికీ రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అప్పటికే జబ్బు మరింత ముదురుతుండడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సోమవారం ‘సాక్షి’ బృందం జిల్లా వ్యాప్తంగా పట్ట ణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల పని తీరుపై విజిట్‌ నిర్వహించింది. జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉదయం ఎనిమిది గంటలకే అనేక మంది ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మరికొంత మందికి ఫార్మాసిస్టులు, స్టాఫ్‌ నర్సులే దిక్కయ్యారు.

పది దాటినా పత్తాలేని వైద్యులు

ఆమనగల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు వైద్యు లకు ఉదయం 10.30 గంటల వరకు ఒక్కరూ రాలేదు. వైద్యులు లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా కన్పించాయి. ఆలస్యంగా ఆస్పత్రికి రావడమే కాకుండా నిర్దేశిత సమయానికి ముందే తిరిగి వెళ్లిపోయారు. యాచారం సీహెచ్‌సీలోనూ ఇదే పరిస్థితి. పది గంటలలోపు వచ్చిన రోగులకు స్టాఫ్‌ నర్సులే మందులు, ఇంజక్షన్లు ఇచ్చి పంపారు. కందుకూరు పీహెచ్‌సీ వైద్యురాలు ఉదయం 10.58 గంటలు దాటినా ఆస్పత్రికి చేరుకోలేదు. ఫార్మాసిస్ట్‌ కూడా ఆలస్యంగా వచ్చారు. వచ్చిన రోగులకు ఏఎన్‌ఎం పెద్ద దిక్కుగా నిలిచింది.

డయాలసిస్‌కు తప్పని నీటికొరత

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో మూడు విడతల్లో 32 మందికి డయాలసిస్‌ చేస్తున్నారు. మరో 18 మంది వెయింటింగ్‌ లిస్ట్‌లో ఉంటున్నారు. డయాలసిస్‌ కోసం సరిపడా నీరులేకపోవడంతో వచ్చిన రోగులందరికీ సేవలు అందించలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఎనిమిది మంది వైద్యులున్నప్పటికీ సాయంత్రం నాలుగు తర్వాత అందుబాటులో ఉండటం లేదు.

పది మందికి వచ్చింది ఆరుగురే..

చేవెళ్ల ఏరియా ఆస్పత్రిలో పది మంది వైద్యులు ఉండగా, ఆరుగురే విధులకు హాజరయ్యారు. ఫార్మాసిస్ట్‌, ఎక్స్‌రే టెక్నీషియన్‌, ల్యాబ్‌ అసిస్టెంట్ల కొరతతో వైద్యసేవల్లో జాప్యం జరుగుతోంది. విపరీతమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకుంటున్న బాధితులకు సగం మందులతో సరిపెడుతున్నారు.లేనివాటిని ప్రైవేటులో కొనుక్కోవాల్సిందిగా సూచిస్తున్నారు.

కొందుర్గు పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇద్దరు వైద్యులకు ఒక్కరే, అదీ పగటి పూటే అందుబాటులో ఉంటున్నారు. ఏఎన్‌ఎంలే స్టాఫ్‌ నర్సుల అవతారం ఎత్తుతున్నారు.

కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ పరీక్షల సేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను బయటికి సిఫార్సు చేస్తున్నారు.

కేశంపేట ఆస్పత్రిలో పని చేసే ల్యాబ్‌టెక్నీషియన్‌ డిప్యూటేషన్‌పై కొండాపూర్‌ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో నందిగామ, కొందుర్గు పీహెచ్‌సీ టెక్నీషియన్‌ వారానికి ఒకరోజు వచ్చి వెళ్తున్నారు.

మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి. 16 మంది వైద్యులకు 9మంది మాత్రమే హాజరవుతున్నారు.

నర్సే చికిత్స చేశారు

చికిత్స కోసం ఉదయం 9 గంటలకే కందుకూరు పీహెచ్‌సీకి వచ్చాను. 10.30 గంటల వరకు చూసినా డాక్టరు రాలేదు. నర్సుతో చికిత్స చేయించుకుని, మందులు తీసుకుని వెళ్తున్నాను. ఇప్పటికి ఇక్కడికి మూడుసార్లు వచ్చాను. ఇంత వరకు వైద్యులతో చికిత్స చేయించుకోలేకపోయాను.

– శ్రీనివాస్‌రెడ్డి, కొత్తూరు, కందుకూరు మండలం

సేవలు అంతంతే..1
1/3

సేవలు అంతంతే..

సేవలు అంతంతే..2
2/3

సేవలు అంతంతే..

సేవలు అంతంతే..3
3/3

సేవలు అంతంతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement