
అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
● కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చొర వచూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో శాఖల వారీగా స్వీకరించిన అర్జీలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలన్నారు. పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ వారం 76 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
వనమహోత్సవానికి ఏర్పాట్లు చేయండి
వన మహోత్సవంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని, గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైన మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచాలని, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని తెలిపారు. వర్షకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్క డా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయాధికారులకు చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దారులు, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల కొరత రానివ్వొద్దు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమ వారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పండే పంటలు, అవసరమైన ఎరువులపై ముందే ఒక అంచనాకు రావాల్సి ఉందన్నారు. రైతుల అవసరాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచాలని, గోదాముల్లో నిల్వ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు, నిర్దేశిత ధరలకు మించి ఎరువులను విక్రయించే వారిపై చర్యలు తప్పవన్నారు. ఉద్దేశ పూర్వకంగా రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, డీసీఎస్ఓ, మండలాల వ్యవసాయ అధికారులు, డీలర్లు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.