
త్వరలో స్వచ్ఛ ‘సర్వే’క్షణ్
● పంచాయతీలకు ర్యాంకులు ● సర్వే ఆధారంగా ఎంపిక ప్రక్రియ ● ఉత్తమ గ్రామాలకు పురస్కారం ● పారిశుద్ధ్యం మెరుగుపర్చడమే లక్ష్యం
ఉన్నతాధికారుల సూచన మేరకు..
స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై త్వరలో సమావేశం జరుగుతుంది. ఉన్నతాధికారుల సూచ నల మేరకు గ్రామాల్లో అన్ని రకాల పనులు చేపడతాం. ఇప్పటికే అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్తను సేకరించడం జరుగుతోంది.
– విజయలక్ష్మి, ఎంపీఓ, కొత్తూరు
కొత్తూరు: పంచాయతీల మధ్య పోటీతత్వాన్ని పెంచడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సర్వే చేసిన వివరాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ఆయా విభాగాల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన పంచాయతీలను గుర్తించి ర్యాంకులు ప్రకటించి పురస్కారాలు అందజేస్తారు. ఈ ఏడాది (2025) సైతం త్వరలో కేంద్ర బృందాలు గ్రామాల్లో పర్యటించి సర్వే చేపట్టనున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, అభివృద్ధి పనులపై అధికారులు పంపిన నివేదికల ఆధారంగా సభ్యులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు.
పరిశీలించే అంశాలు
● ప్రతిఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందా.. ఇంకా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన జరుగుతోందా.. అందరూ మరుగుదొడ్లు వినియోగిస్తున్నారా.. అనే విషయాలు తెలుసుకుంటారు.
● పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం చెత్తను సేకరించే విధానం.. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవగాహన కల్పించారా.. ప్రజలు స్వతహాగా నిర్మించుకున్నారా.. అనేది గ్రహిస్తారు.
● డంప్యార్డుల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను గుర్తిస్తారు.
● అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, తాగునీటి సరఫరా, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించనున్నారు.
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారా.. అనే విషయాలు తెలుసుకుంటారు.
● పలు అంశాల్లో సభ్యులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి వెయ్యి మార్కులకు గాను అధిక స్కోర్ సాధించిన గ్రామాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.
ముందస్తు సమాచారం ఉండదు
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లే అధికారుల ముందస్తు సమాచారం సంబంధిత పంచాయతీలకు ఉండదు. అధికారులు నిర్ణయించుకున్న మేరకు వెళ్లి పలు నివాస గృహాలు, వ్యాపార సముదాయాలతో పాటు పలుచోట్ల సర్వే చేపట్టనున్నారు.

త్వరలో స్వచ్ఛ ‘సర్వే’క్షణ్