తక్కువ ధరకు బంగారమంటూ టోకరా! | - | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకు బంగారమంటూ టోకరా!

Jun 24 2025 7:37 AM | Updated on Jun 24 2025 7:37 AM

తక్కువ ధరకు బంగారమంటూ టోకరా!

తక్కువ ధరకు బంగారమంటూ టోకరా!

సాక్షి, సిటీబ్యూరో: చౌటుప్పల్‌కు చెందిన ఓ రియల్టర్‌ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్‌ నెంబర్‌ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ఆయనకు కాల్‌ చేసిన కర్ణాటక ముఠా తక్కువ ధరకు బంగారం పేరుతో రూ.65 లక్షలు స్వాహా చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్‌గంజ్‌ పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. ఫలితంగా ప్రధాన సూత్రధారిని పట్టుకోవడంతో పాటు రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు తూర్పు మండల డీసీపీ డాక్టర్‌ బి.బాలస్వామి సోమవారం తెలిపారు. అదనపు డీసీపీ జె.నర్సయ్య, సుల్తాన్‌బజార్‌ ఏసీపీ ఎం.మట్టయ్యలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ మోసాలు

కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాలనే టార్గెట్‌గా చేసుకుని మోసాలు చేస్తున్నాయి. పొలం దున్నుతుంటేనో, పాత ఇంటిని కూలుస్తుంటేనో నిధి లభించిందని చెప్తారు. అందులో ఉన్న బంగారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా దాచామని, సగం ధరకే ఇస్తామంటూ ఎర వేస్తారు. వీళ్లు టార్గెట్లను ఎంచుకోవడానికి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ వ్యాపార ప్రకటనలు, దుకాణాలపై ఉన్న పేర్లు, ఫోన్‌ నెంబర్లు ఎంచుకుంటారు. వీరి వల్లోపడుతున్న వారిలో అత్యధికులు రియల్టర్లు, చిన్న స్థాయి బంగారం వ్యాపారులే ఉంటున్నారు. ఇలాంటి ముఠాల్లో తాళ్ల వ్యాపారి జయ కుమార్‌ది ఒకటి. తన బావమరిది ఉదయ్‌, స్నేహితుడు సందీప్‌తో కలిసి రంగంలోకి దిగాడు.

బోర్డుపై ఉన్న ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా

చౌటుప్పల్‌కు చెందిన మునుకుంట్ల నిరంజన్‌ అక్కడి భరత్‌నగర్‌ కాలనీలో శ్రీ బాలాజీ రియల్‌ ఎస్టేట్స్‌ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు. జయ కుమార్‌ నేతృత్వంలోని ముఠా ఈ ఏడాది మార్చిలో ద్విచక్ర వాహనాలపై సిటీకి వచ్చింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ టార్గెట్ల కోసం అన్వేషించింది. చౌటుప్పల్‌లో సంచరిస్తున్నప్పుడు వారి కంట్లో నిరంజన్‌ కార్యాలయం బోర్డు పడింది. అందులో ఉన్న ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా రెడ్డి పేరుతో ఉదయ్‌ సంప్రదించాడు. సగం ధరకు బంగారమంటూ ఎర వేశాడు. అదే నెల్లో రూ.25 వేలు తీసుకుని అరతులం బంగారం ఇచ్చాడు. దీన్ని పరీక్షించిన నిరంజన్‌ మేలిమి బంగారంగా తెలుసుకున్నారు. ఆపై తన స్నేహితుడు దేవేందర్‌తో కలిసి రూ.65 లక్షలకే కేజీ ఖరీదు చేయడానికి సిద్ధయ్యారు. ఈ సందర్భంలో వీరితో రఘు పేరుతో సందీప్‌ కూడా సంప్రదింపులు జరిపాడు.

‘అంబర్‌పేట’ నుంచి అఫ్జల్‌గంజ్‌ వరకు

గత నెల 12న కేజీ బంగారం సిద్ధంగా ఉందని ఫోన్‌ చేసిన రఘు నగదు తీసుకుని పెద్ద అంబర్‌పేట రమ్మని చెప్పాడు. దీంతో నిరంజన్‌ (రూ.45 లక్షలు), ఇతడి స్నేహితుడైన ధర్మేంద్ర (రూ.20 లక్షలు) ఇద్దరూ కలిసి రూ.65 లక్షలు తీసుకుని తమ కారులో పెద్ద అంబర్‌పేటకు వచ్చారు. నిరంజన్‌తో ఫోనులో సంప్రదింపులు జరుపుతున్న రెడ్డి... అక్కడ నుంచి వారిని ఎల్బీనగర్‌కు, ఆపై దిల్‌సుఖ్‌నగర్‌ రప్పించి చివరకు ఎంజీబీఎస్‌ సమీపంలోకి రమ్మన్నారు. అక్కడ వీరిని కలిసిన రఘు వారి వాహనంలోనే ఎక్కాడు. కొద్దిసేపటికి ద్విచక్ర వాహనంపై వచ్చిన జయ కుమార్‌, రెడ్డి బంగారం ఉందంటూ ఓ బ్యాగ్‌ ఇచ్చి, నగదుతో కూడిన బ్యాగ్‌ పట్టుకుపోయారు. అప్పటి వరకు వారితోనే ఉన్న రఘు సైతం దృష్టి మళ్లించి మరో వాహనంపై ఉడాయించాడు. నిరంజన్‌ ఆ బ్యాగ్‌ తెరిచి చూడగా... పైన చీరలు, కింద నాపరాళ్లు కనిపించడంతో మోసపోయినట్లు గుర్తించాడు.

చౌటుప్పల్‌ వ్యాపారి నుంచి రూ.65 లక్షలు స్వాహా

చాదర్‌ఘాట్‌లోని ఎంజీబీఎస్‌ సమీపంలో ఘటన

కర్ణాటకకు చెందిన ప్రధాన సూత్రధారి అరెస్ట్‌

రూ.40 లక్షలు రికవరీ,పరారీలో మరో ఇరువురు

ముమ్మరంగా గాలించినప్రత్యేక బృందం

బాధితుల ఫిర్యాదుతో అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో కేసు నమోదు కాగా... ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రవి, డీఐ రవికిరణ్‌ నేతృత్వంలో ప్ర త్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక అంశాలతో పాటు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టారు. నిందితుల కోస ం కర్ణాటకతో పాటు నగరంలోనూ ముమ్మరంగా గాలించారు. సోమవారం ఎంజీబీఎస్‌ వద్దకు కారులో చేరుకున్న జయ కుమార్‌ను పట్టుకున్నారు. ఇతడి నుంచి కారుతో పాటు రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.25 లక్షలు ఉదయ్‌, సందీప్‌ వద్ద ఉన్నట్లు జయ కుమార్‌ బయటపెట్టాడు. దీంతో పరారీలో ఉన్న వారి ద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement