నిధులు లేక కటకట | - | Sakshi
Sakshi News home page

నిధులు లేక కటకట

Jun 23 2025 8:45 PM | Updated on Jun 23 2025 8:45 PM

నిధుల

నిధులు లేక కటకట

పంచాయతీ నిర్వహణకుఅప్పులభారం

ట్రాక్టర్‌ డీజిల్‌కు సైతం ఇబ్బంది

సొంత నిధులు వెచ్చించలేమని కార్యదర్శుల ఆవేదన

గ్రామాల్లో అటకెక్కిన పరిపాలన

పరిగి: గ్రామాల్లో ప్రత్యేక పాలన వెక్కిరిస్తోంది. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు. దీంతో పాలన కార్యదర్శులకు రోజురోజుకూ భారంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నెలల తరబడి విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల పరిగి, దోమ మండలాల్లోని అన్ని గ్రామాల కార్యదర్శులు సమస్యల పరిష్కారానికి డబ్బులు లేవని ఎంపీఓ, ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేసి పంచాయతీ ట్రాక్టర్ల తాళాలను అందజేశారు. అదే బాటలో మిగతా కార్యదర్శులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న జీపీలు కుదేలు

జిల్లాలో 20 మండలాలు ఉండగా 566 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పోవడంతో విద్యుత్‌ బిల్లులు, కార్మికుల వేతనాలు, వీధి దీపాల బిల్లులు, ట్రాక్టర్‌ నిర్వహణ, బోరు మోటార్ల మరమ్మతులు తదితర వాటికి కాసులు లేక అరిగోసలు పడుతున్నారు. పెద్ద పంచాయతీలకు వస్తున్న కొద్దిపాటి ఆదాయంతో అభివృద్ధి పనులు ఓ మోస్తరుగా సాగుతున్నాయి. కానీ చిన్న పంచాయతీల్లో మాత్రం ఎలాంటి పనులు జరగడం లేదు. రోజు రోజుకూ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దీనంగా మారుతుందని, అప్పుల కుప్పలుగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. తాము గ్రామాల్లో సొంత ఖర్చులతో పనులు చేయలేమని కార్యదర్శులు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు.

కొరవడిన ప్రభుత్వ సహకారం

కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదల కావడం లేదు. గత 20 నెలలుగా గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ఇక రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులైతే 2022 నుంచి నిలుపుదల చేశారు. స్థానిక సంస్థల్లో పాలకవర్గం లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. కొంత కాలంగా పల్లెల్లో సమస్యలను పంచాయతీ కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. ఇలా చాలా మంది కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పులు చేశాం

గ్రామంలో నిత్యం ఎక్కడో ఒక చోట సమస్యలుంటాయి. తొలుత ప్రత్యేక పాలనలో ఇబ్బందులు రాకున్నా దినదినం భారంగా మారుతుంది. వచ్చే జీతం డబ్బులు కూడా గ్రామ సమస్యల కోసం ఖర్చు చేస్తున్నాం. అవి సరిపోకపోవడంతో అప్పులు చేశాం. ఊరిలో సమస్యలు పరిష్కరించాలంటే ఇక సొంత డబ్బులు ఖర్చు చేయలేము.

– వేమారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, రాఘవపూర్‌

నిధులు లేక కటకట 1
1/1

నిధులు లేక కటకట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement