
చెరువులో మునిగి ఇద్దరు మృతి
అబ్దుల్లాపూర్ మెట్: చెరువు పక్కన ఉన్న బండరాయిపై ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మరో యువకుడు కూడా చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన చిన్నపురెడ్డి ప్రతాప్ రెడ్డి, భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అబ్దుల్లాపూర్ మెట్లోని లక్ష్మీ ప్రియానగర్కాలనీలో నివాసం ఉంటున్నారు. అనాజ్పూర్ సమీపంలోని ఇందిరమ్మ చెరువు దగ్గర వెంచర్లో ప్రతాప్రెడ్డి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కూతురు ప్రణీత(10)తో పాటు బంధువులతో కలిసి వెంచర్ దగ్గరికి వెళ్లాడు. వెంచర్ సమీపంలో ఉన్న చెరువు వద్దబండరాయిపై ఆడుకుంటున్న ప్రణీత.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయింది. గమనించిన ప్రతాప్రెడ్డి బంధువు చింతంరెడ్డి ఇంద్రసేనారెడ్డి(20) ఆమెను కాపాడే ప్రయత్నంలో అతను కూడా మునిగి ఇద్దరూ చనిపోయారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నిమ్స్కు తరలించారు.
వేడుకగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం
రాజేంద్రనగర్: బుద్వేల్లోని వీరభద్రస్వామి భద్రకాళి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఉదయం అభిషేకం, అలంకరణ అనంతరం భక్తులకు వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

చెరువులో మునిగి ఇద్దరు మృతి