
వారి రూటే సెపరేటు!
ఎస్ఆర్ఓల్లో అక్రమార్కుల తిష్ట
పాత స్టాంప్ పేపర్లు.. గుట్టుగా రిజిస్ట్రేషన్లు
భూమి విలువ, విస్తీర్ణాన్ని బట్టి వసూళ్లు
వివాదాస్పదమవుతున్న ఘటనలు
ఫిర్యాదులు అందినా చర్యలు శూన్యం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అనధికార లే అవుట్లలో ఖాళీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు.. వివాదాస్పద స్థలాలు.. నిషేధిత యూఎల్సీ.. అసైన్డ్ భూముల్లోని ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు.. నాలా కన్వర్షన్ చేయని భూముల రిజిస్ట్రేషన్లు కొంత మంది సబ్ రిజిస్ట్రార్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేని ఖాళీ స్థలాలకు/ లే అవుట్లలో ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన పార్కులకు పాతస్టాంప్ పేపర్లపై గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లను ఏజెంట్లుగా నియమించుకుని ఒక్కో డాక్యుమెంట్పై భూమి విలువ, విస్తీర్ణాన్ని బట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తుండటం, ఎప్పటికప్పుడు బదిలీలు చేయకపోవడం వీరికి కలిసి వస్తోంది. జిల్లాలో రోజుకు సగటున 650 నుంచి 700 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. వీటిలో అత్యధికంగా శేరిలింగంపల్లి, గండిపేట, ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం, హయత్నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంకర్పల్లి, అబ్దుల్లాపూర్మెట్ ఎస్ఆర్ఓ (సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్) సెంటర్లలో రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. ఆయా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏళ్లుగా అక్రమార్కులు తిష్టవేశారు. ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ప్రైవేటు వ్యక్తులదే హవా
ఎస్ఆర్ఓల్లో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేటు వ్యక్తుల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. డాక్యుమెంటేషన్ మొదలు.. స్కానింగ్ వరకు ప్రతి పనిలో వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) అమల్లోకి వచ్చిన 1998 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రర్డ్ డాక్యుమెంట్లు స్కానింగ్ చేస్తున్నారు. స్కానింగ్ కోసం యంత్రాలు కొనుగోలు చేసిన అధికారులు సిబ్బందిని నియమించలేదు. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు బయటి (జిరాక్స్ సెంటర్లు) వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోంది.
రిజిస్ట్రేషన్ పూర్తయిన రెండు మూడు రోజుల్లోనే పత్రాలు సంబంధిత యజమానికి అందజేయాల్సి ఉంది. కానీ స్కానింగ్లో జాప్యంతో వారం పది రోజులు పడుతోంది. అంతేకాదు విలువైన ఆస్తి పత్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంతో ఒకే ప్లాటుకు రెండు మూడు డాక్యుమెంట్లు అవుతున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లలో దొర్లిన తప్పులను సరి చేసే (ఎడిట్ ఇండెక్స్) అధికారం స్థానిక ఎస్ఆర్ఓలకు ఉండేది. ఇటీవల ఈ బాధ్యతను జిల్లా ఎస్ఆర్ఓకు అప్పగించారు. చేయి తడపనిదే ఎడిట్ ఇండెక్స్ ఫైళ్లు కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
మచ్చుకు కొన్ని కేసులు
● జెడ్పీ రోడ్డు సర్వే నంబర్ 58, సర్వే నంబర్ 60లో వెలసిన లే అవుట్లలో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలకు ఎల్బీనగర్ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదంగా మారింది. నిజానికి ఏదైనా ప్లాటు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించాలి. లింక్ డాక్యుమెంట్లు సరి చూడాలి. ఇక్కడి ఎస్ఆర్ఓ ఇవేవీ పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ప్రజా వసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాన్ని పక్కప్లాటు వ్యక్తి ఆక్రమించుకుని గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశంపై ఇటీవల ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం, సంబంధిత అధికారులపై న్యాయమూర్తి సీరియస్ కావడం చర్చనీయాంశంగా మారింది.
● వ్యవసాయ భూమిని వ్యవసాయేతర (నాలా కన్వర్షన్) భూమిగా మార్చేందుకు మార్కెట్ విలువ ప్రకారం 3 శాతం, ఏదైనా నిర్మాణాలు ఉంటే 4.5 శాతం చొప్పున రుసుం చెల్లించాలి. శేరిలింగంపల్లి మండలం నానక్రాంగూడ సర్వే నంబర్ 48లోని ఏడున్నర ఎకరాల భూమి రిజి స్ట్రేషన్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ భూమి విలువ రూ.166.40 కోట్లు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ఏడున్నర ఎకరాలకు రూ.4.99 కోట్ల వరకు నాలా రుసుం చెల్లించాల్సి ఉంది. నాలా కన్వర్షన్ కాని ఈ భూమిని 37,061 గజాల చొప్పున మార్చి గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేశారు. జిల్లా రిజిస్ట్రార్ దీన్ని గుర్తించి అబెయన్స్లో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు లింకు డాక్యుమెంట్లతో పాటు నాలా, ప్రభుత్వ, ప్రైవేటు, వివాదాస్పద భూములు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్లు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది ఇవేవీ పట్టించుకోలేదు.
● ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఒక లే అవుట్లో కనీసం పది ప్లాట్లు రిజిస్ట్రర్ అయితే అందులోని మిగిలిన ప్లాట్లను సైతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడాన్ని అవకాశంగా తీసుకుని అక్రమాలకు తెరలేపారు. రోజుకు 12 ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ కాని, వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కేవలం ఆరు రోజుల్లోనే 220 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ (2020 ఆగస్టు 26) తర్వాత వెలసిన లే అవుట్లలోని ప్లాట్లు కూడా అంతకు ముందు తేదీలు వేసి, 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో గండి కొట్టారు. డాక్యుమెంట్లు స్కానింగ్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటికి పొక్కింది.
● బాలాపూర్ మండలం అల్మాస్గూడ రెవెన్యూ సర్వే నంబర్ 129,130,131,132లో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ ప్లాట్లకు చంపాపేట ఎస్ఆర్ఓ గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేశారు. మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేని, కోర్టు వివాదంలో ఉన్న ఈ లే అవుట్లోని ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎస్ఆర్ఓ, టౌన్ప్లానింగ్ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.