
ఉత్సాహంగా ‘ఎథ్నిక్ రన్’
శంకర్పల్లి: మండలంలోని పిల్లిగుండ్ల గ్రామంలో ఆదివారం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఎథ్నిక్ రన్ –2025’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద నేరెళ్ల, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వందలాది మంది మహిళలు సంప్ర దాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారద నేరెళ్ల మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం, ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. గుమ్మడి వెన్నెల మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ యువతలో ఆసక్తి పెంపొందించడంలో గండిపేట వెల్ఫేర్ సొసైటీ విజయవంతమైందని అభినందించారు. సొసైటీ జాయింట్ సెక్రెటరీ వాణి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం తమ సొసైటీ ఏర్పడిందని, అప్పటి నుంచి మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఏడు ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు నడుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ‘ఎథ్నిక్ రన్’