
రేషన్ బియ్యం ప్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: సన్నబియ్యం కోసం రేషన్ దుకాణాల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. డీలర్ల నుంచి స్టాక్ లేదనే సమాధానమే వస్తోంది. తుది గడువు సమీపిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రకృతీ వైపరీత్యాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ సర్కారు మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల 1 నుంచి ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభించారు. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటికీ సన్నబియ్యం పొందని లబ్ధిదారులు 20 శాతం ఉన్నారు. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో.. పోర్టబిలిటీని దృష్టిలో పెట్టుకుని జీవనోపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల కార్డుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం సేకరణ చేపట్టాల్సిన అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో రేషన్ దుకాణాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి నెలకొంది.
మరో 11 వేల మెట్రిక్ టన్నులు వస్తేనే..
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 5,37,805 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మూడు నెలల బియ్యం కోటాకు సంబంధించి 34,535 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ లెక్కలేసింది. జిల్లాలో జీవనోపాధి కోసం వచ్చిన వలస కుటుంబాలకు సంబంధించి లక్షకు పైగా ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీరంతా ఇక్కడే రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. పోర్టబిలిటీతో కలిపి జిల్లాకు 45,535 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా, 34,535 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుమతయ్యాయి. లబ్ధిదారులు రేషన్ దుకాణం వద్దకు వస్తే డీలర్ల నుంచి స్టాక్ లేదన్న సమాధానం వస్తుండటంతో నిత్యం తిరగాల్సి వస్తోంది. మరో 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తేనే లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందనున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి
రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో జీవనోపాధి కోసం వచ్చిన వలస కుటుంబాలు అత్యధికంగా ఉండటంతో పాటు.. సన్నబియ్యం కూడా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి తరలించాల్సి రావటంతో జాప్యం ఏర్పడింది. దీంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కార్డుల సంఖ్యకు అనుగుణంగా రేషన్ దుకాణాలు లేకపోవటం కూడా మరో కారణం.
30తో ముగియనున్న పంపిణీ గడువు
స్టాక్ లేదని తిప్పి పంపుతున్న రేషన్ డీలర్లు
లబ్ధిదారుల్లో కొనసాగుతున్న ఆందోళన
వలస కుటుంబాల
పరిస్థితి దయనీయం
లబ్ధిదారులందరికీ అందజేస్తాం
ఆహార భద్రత కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తాం. పోర్టబిలిటీతో పాటు మూడు నెలలకు సన్నబియ్యం ఒకేసారి ఇస్తుండటంతో జాప్యం ఏర్పడుతోంది. దుకాణాలకు పంపిణీ చేయడంతో పాటు ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందేలా చూస్తాం.
– శ్రీనివాస్రెడ్డి, డీఎస్ఓ, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా