వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు

May 31 2025 6:55 AM | Updated on May 31 2025 3:44 PM

వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు

వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు

జూన్‌ 2 నుంచి సెప్టెంబర్‌ 10 వరకు..

ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి

వన మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

వానాకాలం ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మాన్‌సూన్‌’ పేరిట వంద రోజుల ప్రణాళికకు సిద్ధం కావాలని ఆదేశించింది. డివిజన్ల వారీగా ఆయా కార్యక్రమాలు చేపడుతూ సమస్యలు పరిష్కరించాలని పేర్కొంది. ఈ మేరకు అధికారులకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. 

మీర్‌పేట: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల ప్రణాళికకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్‌ 2 నుంచి సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా ముందస్తుగా మురుగు కాలువలు, నాలాలు, ఓపెన్‌, భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయడంతో పాటు పాడైపోయిన మ్యాన్‌హోళ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టనున్నారు.

ప్రజలకు ముందస్తుగా అవగాహన

వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. బస్తీలు, కాలనీలు, రహదారులు, ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాల్లో ప్రతిరోజు బ్లీచింగ్‌ చేయడం, ఫాగింగ్‌ చేయడం, చెరువుల్లో దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ద్రావణాన్ని వేయడం చేయనున్నారు. వర్షాకాలంలో అంటురోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలకు ముందుస్తుగా అవగాహన కల్పించనున్నారు.

ఉమెన్‌ అమృత మిత్ర 2.0

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వన మహోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ‘ఉమెన్‌ అమృత మిత్ర 2.0’ కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించి ‘ఉమెన్‌ ఫర్‌ట్రీ పేరిట’ మహిళలతో మొక్కలు నాటించి సంరక్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పాటు మున్సిపాలిటీల్లోని అన్ని పార్కులు, ఇళ్ల వద్ద, చెరువు కట్టలు, వాకింగ్‌ ట్రాక్‌లు, శ్మశానవాటికలు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ భవనాల వద్ద ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు.

అన్ని చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్పొరేషన్‌లో వంద రోజుల ప్రణాళిక యాక్షన్‌ప్లాన్‌ ఇప్పటికే సిద్ధం చేశాం. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే దానిపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశాం. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అంటు రోగాలు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తాం.
– జ్ఞానేశ్వర్‌, కమిషనర్‌, మీర్‌పేట మున్సిపాలిటీ

జిల్లాలోని మున్సిపాలిటీలు
మీర్‌పేట, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌

ఆదిబట్ల, ఆమనగల్లు, చేవెళ్ల, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, మణికొండ, మొయినాబాద్‌, నార్సింగి, పెద్దఅంబర్‌పేట, షాద్‌నగర్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, తుక్కుగూడ, తుర్కయంజాల్‌ కార్పొరేషన్‌లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement