
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసే కుట్ర
ఇబ్రహీంపట్నం రూరల్: పేద ప్రజలకు ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద దేశంలో 30 కోట్ల మంది పేద ప్రజలు పని చేస్తున్నారని, మరో 65 లక్షల మంది పనికోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పేదలకు ఉపాధి కల్పించే చట్టాని నిర్వీర్యం చేయాలని చూస్తే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఉపాధి చట్టాన్ని రక్షించుకోవాలని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు. చట్టం ప్రకారం ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పించాల్సిన ప్రభుత్వం 40 నుంచి 50 రోజులు మాత్రమే కల్పిస్తోందన్నారు. దేశంలో పనులు చేసే వారు లేరని మోదీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న 65 లక్షల మందికి ఎందుకు పనులు కల్పించడం లేదని ప్రశ్నించారు. దినసరి కూలీ రూ.307 చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు నేటికీ అమలు చేయడం లేదన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదల కష్టాలు తీరుతాయనుకుంటే భూస్వాములు, పెట్టుబడిదారులకు దాసోహం అవుతున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న రూ.12వేల ప్రస్తావన లేదని, మహిళలకు రూ.2,500 మాటలేదని, ఆడబిడ్డ పెళ్లి కానుక తులం బంగారం మరిచిపోయారన్నారు. హామీలు అమలు చేయడం చేతకాని సీఎం ఎందుకని, కుర్చీ దిగిపోవాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామేలు, డి.జగదీష్, కందుకూరి జగన్, జిల్లా నాయకులు నర్సింహ, కిషన్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో గ్యారంటీల ఊసేలేదు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ