
దోపిడీ లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
చేవెళ్ల: దేశంలో దోపిడీలేని సమాజ నిర్మాణమే లక్ష్యమని జనసేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేశ్ అన్నారు. చేవెళ్లలోని సత్యసాయి పాఠశాల ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జనసేవాదళ్ శిక్షణ తరగతుల్లో భాగంగా శుక్రవారం సభ్యులకు లక్ష్యాలు, కర్తవ్యాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా జనసేవాదళ్ సభ్యులను తయారు చేస్తోందని తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ముగింపు సభకు పదివేల మంది హాజరయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సామాజిక అంశాలతోపాటు ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు చేపట్టేలా కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. పేద ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించే విధంగా పార్టీకి ముందుండే నడిపించే సైనికుల్లా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు, నియోజకవర్గం ఇన్చార్జి కె.రామస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, నాయకులు వండ్ల మంజుల, మురళీమోహన్, కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీని విజయవంతం చేయాలి
చేవెళ్లలో కొనసాగుతున్న శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో నాయకులు ప్రభులింగం, సత్యనారాయణ, సత్తిరెడ్డి, మంజుల, మక్బుల్, మీనాక్షి, శివ, అంజయ్య తదితరులు ఉన్నారు.
జనసేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేశ్