
ప్రపంచానికి భారత్ సత్తా తెలిసింది
మీర్పేట: ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి భారత్ సత్తా తెలిసిందని రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ అన్నారు. వీర జవాన్లకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం కార్పొరేషన్ పరిధి లెనిన్నగర్ నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో తయారు చేసిన యుద్ధ యంత్రాలు, విమానాలు, ఆయుధాలు, ఆకాశ్, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు, మిస్సైల్స్ ప్రపంచ దేశాలను అబ్బురపరిచాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని యుద్ధనీతితో అంతం చేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనికులు వీరోచితంగా పోరాటం చేసి విజయం సాధించారన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా మతాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటిచెప్పడానికి చేపడుతున్నదే తిరంగా ర్యాలీ అని వివరించారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీరీలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు పర్యాటకాన్ని అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ర్యాలీలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్, నాయకులు బొక్క నర్సింహారెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, కొలన్ శంకర్రెడ్డి, మీర్పేట–1,2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, గాజుల మధు, విక్కీసాగర్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్