ఇబ్రహీంపట్నం: తాను కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటనర్సప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్లు చెప్పారు. తనపై ఉద్దేశ పూర్వకంగా కొందరు అవాస్తవాలు ప్రచారం చేసి, కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు సూచనల మేరకే వ్యవహరిస్తున్నట్లు వివరించారు.
విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి
షాబాద్: విద్యుదాఘాతంతో ఓ పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చర్లగూడలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్కల కిష్టయ్యకు చెందిన ఆవు మేత మేస్తూ మీరాపూర్ సమీపంలో విద్యుత్ టాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. దాని విలువ సుమారు రూ.లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
త్వరితగతిన ఎస్టీపీల పనులు
సాక్షి, సిటీబ్యూరో: ఎస్టీపీల పనుల్లో వేగంపెంచి తుదిదశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఈడీ మాయాంక్ మిట్టల్తో కలిసి అంబర్పేట్, అత్తాపూర్ ఎస్టీపీలను సందర్శించారు. తొలుత అంబర్పేట్ ఎస్టీపీకి వెళ్లిన ఆయన.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. చిన్న చిన్న సివిల్ వర్క్లు, గార్డెనింగ్, పెయింటింగ్, అంతర్గత రోడ్ల నిర్మాణంలాంటి పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఎస్టీపీని ప్రారంభానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అనంతరం అత్తాపూర్ ఎస్టీపీని సైతం సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన ఎండీ మిగిలిపోయిన పనుల్ని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం సుజాత, ఎస్టీపీ ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.