బైక్‌ ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలు

May 28 2025 5:49 PM | Updated on May 28 2025 5:49 PM

బైక్‌

బైక్‌ ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలు

కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్‌ తెలిపిన వివరాలు.. కడ్తాల్‌ గ్రామానికి చెందిన కడారి శివరాజ్‌(66) మంగళవారం ఉదయం మండల పరిధిలోని కొత్తూర్‌లో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తన స్కూటీపై గూడురు వైపు వెళ్తుండగా శ్రీశైలం హైవే కొత్తూర్‌ గేట్‌ వద్ద కందుకూరు వైపు నుంచి వేగంగా వచ్చిన పల్సర్‌ బైక్‌ ఢీకొట్టింది. దీంతో శివరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో పోలీసులు, స్థానికులు అతన్ని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పరమేశ్‌ తెలిపారు.

రైలు ఢీకొని కార్మికుడి మృతి

నందిగామ: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన నందిగామ రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హైడ్‌ కానిస్టేబుల్‌ మల్లేశ్వర్‌ కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన రమేష్‌(40) కొంత కాలం క్రితం కొత్తూరు మండలం తిమ్మాపూర్‌కు వలస వచ్చి స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం అతని మృత దేహాన్ని నందిగామ మండల పరిధిలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. తిమ్మాపూర్‌ రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ రహమాత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాదవశత్తు రైలు ఢీ కొట్టిందా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

డీసీఎం ఢీ : తీవ్ర గాయాలు

నందిగామ: ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలకు గురైన ఘటన మండల పరిధిలోని 44వ నంబర్‌ జాతీయ రహదారి (బైపాస్‌)పై చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నందిగామ మండలం బండకుంట తండాకు కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. స్థానికంగా ఓ జామ తోటలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన బైక్‌పై మంగళవారం షాద్‌నగర్‌ వైపునకు వెళ్తుండగా ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమ సమీపంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ పై నుంచి ఎగిరిపడ్డ వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుమారుడు పరుశురారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాటరీల దొంగ దొరికాడు

కేశంపేట: మండలంలో ఇటీవల చోరీ అయిన బ్యాటరీలను పోలీసులు రికవరీ చేశారు. మండల పరిధిలోని లేమామిడి, కేశంపేట, బైర్కాన్‌పల్లి గ్రామాల్లో ఇటీవల వాహనాల బ్యాటరీలతో పాటు జనరేటర్‌ బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఇదే విషయమై బాధితుల నుంచి పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందాయి. పోలీసులు బ్యాటరీ దొంగతనాలను ఛేదించేందుకు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమోరాల్లో నమోదైన పుటేజీలతోపాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని లక్ష్మీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మేగిశెట్టి నాగేశ్వర్‌రావు బ్యాటరీలను దొంగిలించినట్టు గుర్తించారు. అతడి నుంచి 12 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం

నవాబుపేట: ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టిగిద్ద గ్రామానికి చెందిన బక్కని ఏసు కొడుకు సందీప్‌(23), వికారాబాద్‌లో ఐటీఐ చదువుతున్నాడు. ఏడాది క్రితం పట్టణానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సందీప్‌ గత సోమవారం సాయంత్రం తమ పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

బైక్‌ ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలు 1
1/1

బైక్‌ ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement