
మట్టితో పూడ్చేసి!
నాలాపై కన్నేసి..
ఇబ్రహీంపట్నం రూరల్: దాతర్చెరువు కాల్వపై కన్నేసిన అక్రమార్కులు మట్టితో నింపి కబ్జా చేశారు. అర కిలోమీటర్ మేర నాలాను ఆక్రమించి రెండున్నర ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ప్రస్తుత మార్కెట్లో దీని విలువ రూ.కోట్లలో ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిబట్ల మున్సిపల్ పరిధి కొంగరకలాన్లోని దాతర్ చెరువు నిండితే.. అలుగు పారి పులందరి వాగులోకి చేరుతుంది. దాతర్ చెరువును ఆనుకుని ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ వేసింది. ప్రస్తుతం దీని పక్కనే ఉన్న భూములను కొనుగోలు చేస్తోంది. దాతర్ చెరువు నాలా రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది. భారీ ప్రవాహం ఉండే చారిత్రక ఆనవాళ్లు కలిగిన నాలాను కొంతమంది రాత్రికి రాత్రే చెరబట్టారు. వేలాది ట్రిప్పుల మట్టి నింపి దాదాపు 500 మీటర్ల పొడవునా కాల్వను కనుమరుగు చేశారు. చెరువు కట్టను సైతం చీల్చి దాదాపు రెండున్నర ఎకరాల భూమిని కబ్జా చేశారు. మార్కెట్లో దీని విలువ రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వందల ఏళ్ల నాటి కాల్వను పూడ్చేసిన అక్రమార్కులు ప్రత్యామ్నాయంగా కొత్త కాల్వ తవ్విస్తున్నారు. దీనికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేదు.
ఫిర్యాదుతో విచారణ
కబ్జా విషయమై కొంగరకలాన్కు చెందిన నీళ్ల హరిబాబు అనే వ్యక్తి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఏఈ హరిత క్షేత్ర సందర్శనకు వచ్చారు. గ్రామ నక్షా, కాలువ విస్తీర్ణం తదితర అంశాలను పరిశీలించారు. విచారణ అనంతరం నివేదిక రూపొందించి, ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
రాత్రికి రాత్రే దాతర్చెరువు కాల్వ ఆక్రమణ
రెండున్నర ఎకరాల భూమికి ఎసరు
పూర్తిస్థాయి విచారణకు ఇరిగేషన్ డీఈఈ ఆదేశం
కబ్జా నిజమని తేలితే..
నాలా ఆక్రమణ విషయమై మాకు ఫిర్యాదు అందింది. అధికారులు, సిబ్బందిని ఫీల్డ్ విజిట్కు పంపించాం. పూర్తి స్థాయి విచారణ, సర్వేకు ఆదేశించాం. కాల్వను పూడ్చారని, కబ్జా వాస్తవమేనని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– చెన్నకేశవరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ

మట్టితో పూడ్చేసి!