
పాదచారుడిని ఢీకొట్టిన కారు
ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఓ పాదచారుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడి కాలు విరిగిపోయింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. తుర్కయంజాల్లోని సూర్యనగర్ కాలనీకి చెందిన పున్న ఎల్లయ్య(73) సాగర్ హైవేపై కమాన్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. బీఎన్రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమకాలుకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపారు.
మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజు కథనం ప్రకారం.. తుర్కయంజాల్లో నివాసం ఉండే ఓ మహిళకు ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. ఆమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు. ఆర్థిక సమస్యలతో 2022లో సదరు మహిళ బొంగ్లూర్లోని ఈకామ్ ఎక్స్ప్రెస్లో 8 నెలలు సెక్యూరిటీగా పని చేసింది. ఆ సమయంలో సహోద్యోగి ప్రవీణ్తో ఆమెకు స్నేహం ఏర్పడింది. అనంతరం ఆమె ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంది. కానీ ప్రవీణ్ నిత్యం ఫోన్ చేసి మాట్లాడి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆదిబట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఆమె చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం
శంకర్పల్లి: మనోవేదనకు గురైన ఓ వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం శంకర్పల్లి పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని చిన్న శంకర్పల్లికి చెందిన జోన్నాడ బాలరాజ్(55)కు ఇద్ద రు కుమారులున్నారు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారం ఆయన మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకి ఎదురెళ్లి.. బలవన్మరణానికి పాల్పడ్డా డు. లో కోపైలట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
లిఫ్టు అడిగి.. మృత్యు ఒడికి
స్కూటర్ నుంచి జారిపడి మహిళ మృతి
చేవెళ్ల: లిఫ్టు అడిగి స్కూటర్పై వెళ్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందింది. ఈ సంఘటన చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపల్లికి చెందిన మంగళి లక్ష్మి(32) చేవెళ్లలో వివేకానంద పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఆది వారం ఉదయం ఆమె ఇంటి నుంచి పనికోసం బయలు దేరింది. ఆలస్యం కావడంతో స్కూల్ బస్సు వెళ్లిపోయింది. దీంతో ఆమె బైక్ మీద లిఫ్టుపై వెళ్తోంది. మార్గమధ్యలో చేవెళ్లకు సమీపంలోకి రాగానే స్కూటర్పై నుంచి లక్ష్మి ప్రమాదవశాత్తు జారి పడి తలకు గాయమైంది. వెంటనే స్థానికులు పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర జంతువు జింక మృతి చెందింది. ఈ సంఘటన శనివారం రాత్రి శ్రీశైలం హైవే రాచులూరు గేట్ సమీపంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద చోటు చేసుకుంది. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న గుమ్మడవెల్లి అటవీ శాఖ అధికారి విజయ్భాస్కర్ సిబ్బందితో ఆ జింకను రాచులూరు పశువైద్యశాలకు తరలించారు. కా గా పశువైద్యుడు డాక్టర్ షాహీన్షేక్ ఆ జింకకు పోస్టుమార్టం నిర్వహించి, అట వీ అధికారులకు అప్పగించగా దానికి వారు అంత్యక్రియలు నిర్వహించారు.
రెండు ఇళ్లలో చోరీ
సనత్నగర్: తాళాలు పగులగొట్టి రెండు ఇళ్లల్లో చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి నగదు, సెల్ఫోన్ ఎత్తుకెళ్లిన సంఘటన బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట తాతాచారి కాలనీలో మెండా కిషోర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న సాయంత్రం బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి నేరుగా మొదటి అంతస్తుకు వెళ్లి నూతన ప్రసాద్ అనే వ్యక్తి ఇంటి తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో దొరికిన రూ.2 వేల నగదు అపహరించాడు. అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చి అద్దెకు ఉండే సాయికిరణ్ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.4 వేల నగదుతో పాటు మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు.