
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కందుకూరు: రోడ్డు ప్ర మాదం ఓ యువకుడిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బేగంపేట పంచాయతీ పరిధిలోని గాజులబురుజుతండాకు చెందిన రమావత్ పాడ్య కుమారుడు దేవ్సింగ్(24) శనివారం సాయంత్రం బైక్పై కూరగాయలు తేవడానికి బేగంపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఆంజనేయస్వామి గుడి వద్ద ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ అతని బైక్ను ఢీకొట్టింది. దీంతో దేవ్సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆదివారం ఎస్ఐ పరమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి అదృశ్యం
మీర్పేట: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సారంగపాణి కథనం ప్రకారం.. బడంగ్పేట బాలాజీనగర్లో నివాసముండే ఎస్.శ్రీకాంత్(41) వృత్తిరీత్యా డ్రైవర్. ఇతనికి భార్య కవిత, ముగ్గురు కుమార్తెలున్నారు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కవిత ముగ్గురు పిల్లలను తీసుకుని గజ్వేల్లోని కేసారమైన పుట్టింటికి సంవత్సరం క్రితం వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శ్రీకాంత్ అప్పుడప్పుడు భార్యాపిల్లల వద్దకు వెళ్లి వస్తుంటాడు. వారం రోజుల క్రితం శ్రీకాంత్ ఇంట్లో తల్లికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లి నర్సమ్మ ఆదివారం మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి