
సబర్బన్ బస్ సౌకర్యం కల్పించండి
కడ్తాల్: హైదరాబాద్ నుంచి కడ్తాల్, ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్కు ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలో మంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యల గురించి వివరించారు. కడ్తాల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. షాద్నగర్– కడ్తాల్ రూట్లో షాద్నగర్ డిపోనకు చెందిన సర్వీసులు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఈ మార్గంలో బస్సులు తిప్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు.. నగరానికి సమీపంలోని కడ్తాల్, ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులు ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యార్థులకు, ఉపాధి రీత్యా, ఇతర అవసరాల కోసం నగరానికి వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని, సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని చైర్ పర్సన్ తెలిపారు.
మంత్రి పొన్నంకు మార్కెట్ చైర్పర్సన్ వినతి