శ్రామికశక్తికి జై | - | Sakshi
Sakshi News home page

శ్రామికశక్తికి జై

May 1 2025 7:30 AM | Updated on May 1 2025 7:30 AM

శ్రామ

శ్రామికశక్తికి జై

రెక్కలు ముక్కలు చేసుకుని..

చెమట చుక్కలు చిందిస్తూ..

ప్రాణాలను పణంగా పెట్టి..

పరిశ్రమల్లో శ్రమదోపిడీకి గురవుతూ..

కష్టాల కడలిలో శ్రమజీవుల బతుకులు

నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం

షాద్‌నగర్‌: వారిబలంతో కొండలనైనా కరిగిస్తారు.. నిరంతరం శ్రమనే నమ్ముకుని లక్ష్యం సాధిస్తారు.. కాలుష్యపు కోరల్లో, కఠోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.. అర్ధాకలికి అలమటిస్తూ.. శ్రమ దోపిడీకి గురవుతున్నారు.. పారిశ్రామిక రథచక్రాలను తమ భుజస్కందాలపై నడిపిస్తున్నారు.. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అధిగమిస్తూ తమదైన పంథాలో ముందుకు సాగుతున్నారు.. కష్టాన్ని నమ్ముకొని చెమటచుక్కలు చిందిస్తున్నారు.. బతుకుపోరాటం సాగిస్తున్నారు కార్మికులు.. నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

యంత్రాల మధ్య నలుగుతున్న జీవితాలు

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే పరిశ్రమలు కార్మికుల ఉసురు తీస్తున్నాయి. పారిశ్రామిక వాడలను నమ్ముకొని, కుటుంబాలను వదిలి.. ఒంటరిగా కొందరు.. కుటుంబాలతో మరికొందరు వలస వస్తున్నారు. సలసలమండే నిప్పుల కొలిమిలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటికై నా కష్టాల నుంచి గట్టెక్కుతామన్న ఆశతో పని చేస్తున్న శ్రమజీవులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. వేతనాలు సరిగా లభించక శ్రమదోపిడీకి గురవుతున్నారు. రక్షణ కవచాలు అందించకపోవడంతో చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా యంత్రాల మధ్య నలిగిపోతున్నారు. జిల్లా పరిధిలో నాలుగేళ్లలో వందల మంది కార్మికులు ప్రమాదాల బారిన పడ్డారు. ఒంటరిగా వచ్చి మృత్యువాత పడిన అనాథశవాలకు స్థానికులు అంత్యక్రియలు నిర్వహించిన సంఘటలు ఉన్నాయి.

కన్నెత్తి చూడని అధికారులు

పరిశ్రమల్లో కార్మికులు అవస్థలు పడుతున్నా, యాజమాన్యాల నిర్లక్ష్యానికి గురవుతున్నా కార్మిక శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. పరిశ్రమ యాజమాన్యాల మామూళ్లకు తలొగ్గుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఎవరైనా కార్మికుడు మరణిస్తే వారి కుటుంబాలకు సరైన పరిహారం కూడా అందడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నేతలంతా ఏకమై నినదిస్తే కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారు.

జిల్లాలో పరిశ్రమలు ఇలా..

జిల్లాలో భారీ, మధ్య తరహా, చిన్న పరిశ్రమలు సుమారు 3,474 ఉన్నాయి. వీటిలో మైక్రో పరిశ్రమలు 2,182, చిన్నతరహా 1,094, మధ్య తరహా 62, భారీ 103, మెగా 9, మెగా ఇన్‌ఫ్రా పరిశ్రమలు 24 వరకు కొలువుదీరాయి. ఇందులో బిహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 35వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. 80శాతం మంది వలస కార్మికులు ఉన్నారు. 70 శాతం మంది కాంట్రాక్టు కార్మికులు, 30 శాతం మంది రెగ్యులర్‌ ఉద్యోగులు పరిశ్రమల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

చట్టాలను పునరుద్ధరించాలి

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలి. రెక్కాడితే కాని డొక్కాడని కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలవాలి. వారి సంక్షేమం కోసం పాటుపడాలి.

– పానుగంటి పర్వతాలు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి

సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి

ఎంతో మంది తమ ప్రాణాలు అర్పించి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నారు. చాలా పరిశ్రమల్లో శ్రమదోపిడీకి గురవుతున్నారు. కార్మికుల సంక్షేమానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి.

– ఎన్‌.రాజు, సీఐటీయూ జిల్లా అద్యక్షుడు

శ్రామికశక్తికి జై 1
1/2

శ్రామికశక్తికి జై

శ్రామికశక్తికి జై 2
2/2

శ్రామికశక్తికి జై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement