సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ భాగంగా కొత్తగా ఏర్పాటైన 11 శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్లు శుక్రవారం నుంచి అధికారికంగా పని ప్రారంభించనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని పోలీసుస్టేషన్లకు భవనాలు సమకూరగా, మరికొన్నింటికి తాత్కాలికంగా కేటాయించారు. ఈ పోలీసుస్టేషన్ల పరిధులపై మ్యాప్లు కూడా సిద్ధం చేసిన ఉన్నతాధికారులు అటు పోలీసులతో పాటు ఇటు సామాన్య ప్రజలకు వీటిపై అవగాహన కల్పించనున్నారు. శుక్రవారం నుంచి నయా పోలీసుస్టేషన్లలో ప్రాథమిక సమాచార నివేదికల (ఎఫ్ఐఆర్) నమోదు ప్రారంభమవుతుంది. ఈ ఠాణాలకు డిజిగ్నేటెడ్ కోర్టులను కేటాయించాల్సిందిగా కోరుతూ ఇప్పటికే కొత్వాల్ సీవీ ఆనంద్ న్యాయమూర్తికి లేఖ రాశారు.
కొత్త ఠాణాలు ఇవే:
దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారాసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడిమల్కాపూర్, ఫిల్మ్నగర్, మాసబ్ట్యాంక్, మధురానగర్, బోరబండ.