
లోలెవల్ కష్టాలు తీరేదెప్పుడో?
● కల్వర్టులపై నుంచి పారుతున్న వరద ● వర్షాకాలంలో నిలిచిపోతున్న రాకపోకలు ● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ● పట్టించుకోని అధికారులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వర్షాకాలం వచ్చిందంటే జిల్లాలో 95 లోలెవల్ కల్వర్టుల వద్ద వరద పొంగి ప్రవహిస్తుంటుంది. ఫలితంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఈ సమస్య ఎదురవుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,636 రహదారులుండగా.. 95 రహదారులపై గల లోలెవల్ కల్వర్టులపై నుంచి నీరు పారుతోంది. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్ మండలాల్లో వరదకష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్శాఖల మధ్య సమన్వయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణం నరకం
● ఎల్లారెడ్డిపేట మండలం పదిర, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి మధ్య మానేరువాగుపై వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. మానేరువాగుపై వంతెన నిర్మాణానికి సుమారు రూ.50కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అక్కపల్లి వద్ద వాగు పొంగుతుండడంతో ప్రతీ సీజన్లో రాకపోకలు నిలిచిపోతున్నాయి.
● ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండలంలోనే నాలుగు రూట్లలో 8 లోలెవల్ కల్వర్టులతో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.
జిల్లాలో రోడ్ల వివరాలు
రోడ్ల విస్తీర్ణం : 595.869 కిలోమీటర్లు
బీటీ రోడ్లు : 570.061 కిలోమీటర్లు
మట్టి రోడ్లు : 5.05 కిలోమీటర్లు
సీసీ రోడ్లు : 20.308 కిలోమీటర్లు
పంచాయతీరాజ్ రోడ్లు : 1,041 కిలోమీటర్లు
ఆర్అండ్బీ రోడ్లు : 595 కిలోమీటర్లు
లోలెవల్ వంతెనలు, కల్వర్టులు : 95
ఇది ఎల్లారెడ్డిపేట మండలం పదిర–రామలక్ష్మణుపల్లి గ్రామాల మధ్య గల మానేరువాగుపై ఉన్న లోలెవల్ వంతెన. గతంలో కురిసిన వరదనీటితో కల్వర్టు కొట్టుకుపోవడంతో ప్రస్తుతం మానేరువాగుపై తాత్కాలికంగా రోడ్డు వేశారు. రూ.50కోట్లతో వంతెన నిర్మించాలన్న ప్రతిపాదనలు బుట్టదా ఖలయ్యాయి. ఫలితంగా ఏటా వర్షాకాలంలో మానేరువాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. శాశ్వత పరిష్కారంగా వంతెన నిర్మించాలనే డిమాండ్ ఉంది.
ఇది ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి శివారులోని లేతమామిండ్లవాగుపై ఉన్న లోలెవల్ కల్వర్టుపై నుంచి పారుతున్న వరదనీరు. చిన్నపాటి వర్షానికి ఇక్కడ వరద వచ్చి మండల కేంద్రానికి అక్కపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోతుంటాయి. అంతేకాకుండా కోనరావుపేట– ఎల్లారెడ్డిపేట మండలాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ వాగుపై వంతెన నిర్మించాలన్న విన్నపాలు నెరవేరడం లేదు. ఇలాంటి పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా 95 లోలెవల్ కల్వర్టుల వద్ద ఉంది. ఏటా వర్షాకాలంలో లోలెవల్ కల్వర్టుల కష్టాలు తీరడం లేదు.

లోలెవల్ కష్టాలు తీరేదెప్పుడో?