
నిధులు లేక నిరాధరణ
గంభీరావుపేట(సిరిసిల్ల): నిధుల కొరత.. పాలకుల నిర్లక్ష్యానికి జిల్లాలోని ఏకై క చేపపిల్లల ఉత్పత్తికేంద్రం నిరాధరణకు గురవుతుంది. 50 ఏళ్ల క్రితం నర్మాల ఎగువమానేరు జలాశయంలోని నీటిని ఆధారం చేసుకొని దాదాపు 16 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆఫీస్ భవనం, ఫిష్పాండ్స్ శిథిలావస్థకు చేరాయి. కార్యాలయంలోని సామగ్రి పాడైపోయింది. అక్కడికి వెళ్లేందుకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇక్కడ మూడేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి, పెంపకం నిలిచిపోయింది. ఫిష్పాండ్స్ పగుళ్లుబారాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టార్పాలిన్ కవర్లకు సైతం కాలం చెల్లిపోయింది.
పాడైపోతున్న సామగ్రి
ఏటా వేలాది చేపపిల్లలను ఉత్పత్తి చేసి తక్కువ ధరకు మత్స్యకారులకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన కేంద్రం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుంది. భవనాలు, ఫిష్పాండ్స్, సామగ్రి పాడైపోతున్నాయి. ఏళ్ల తరబడి నిధులు లేక మరమ్మతులకు నోచుకోవడం లేదు. కేంద్రాన్ని పునరుద్ధరిస్తే స్థానిక మత్స్యకారులకు, రైతులకు ఎంతో మేలు కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాతపాండ్స్ను తొలగించి కొత్తవి నిర్మించి చేపపిల్లల ఉత్పత్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. మత్స్యకారులకు శిక్షణ కేంద్రంగా సైతం అభివృద్ధి చేయవచ్చు. గతంలో కేంద్రం పునరుద్ధరణకు అధికారులు రూ.60లక్షల అంచనాతో ప్రతిపాదనలు పంపినా మరమ్మతుకు నోచుకోలేదు.
నీరసించిపోతున్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం
శిథిలావస్థలో భవనం.. ఫిష్పాండ్స్
50 ఏళ్ల క్రితం 16 ఎకరాలలో ఏర్పాటు
పట్టించుకోని పాలకులు, అధికారులు

నిధులు లేక నిరాధరణ