
అయ్యో.. ఇదేం శిక్షణ
సిరిసిల్ల: భూభారతి చట్టంలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో మే 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 163 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేయగా, 156 మందిని ఎంపిక చేశారు. ఎంపికై నవారికి మే 26 నుంచి చంద్రంపేట రైతు వేదికలో శిక్షణ ప్రారంభించారు. కాగా, జిల్లాలో ఇప్పటికే 19 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారు. భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో వ్యవసాయ భూములను సైతం కొలతల నక్షా(మ్యాప్) ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం నిజాం కాలం నాటి షేత్వార్(టీపన్) నక్షాలు ఉన్నాయి. రెవెన్యూ సర్వేలాండ్ రికార్డుల ప్రకారం హద్దులు నిర్ణయిస్తున్నారు. ఈ విధానంతో సమస్యలు వస్తున్నాయి. తాజాగా భూభారతి చట్టంలో నక్షా ఉండాలనే విధానాన్ని తేవడంతో లైసెన్స్డ్ సర్వేయర్ల అవసరం ఏర్పడింది.
రైతు వేదికలో ఇబ్బందులు ఇవీ..
● మైకు రీసౌండ్ వస్తుంది. శిక్షణ ఇచ్చే అధికారులు చెప్పేది అభ్యర్థులకు అర్థం కావడం లేదు. బోర్డుపై రాసిన అక్షరాలు, మ్యాప్లు అభ్యర్థులకు కనిపించడం లేదు.
● డెస్క్లు లేకుండా కుర్చీలు మాత్రమే ఉండడంతో రికార్డులు రాసుకునేందుకు కింద కూర్చోవాల్సి వస్తుంది.
● రైతు వేదికలో మరుగుదొడ్లు, మూత్రశాలల్లో నీళ్లు లేక కంపు కొడుతున్నాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
● రైతు వేదిక రేకులతో నిర్మించడంతో ఎప్పుడైనా వర్షం వస్తే.. బొలబొల శబ్దంతో ఇబ్బందిగా ఉంది. ఎండలు కొడితే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
● స్థానిక రైతులకు ఏదైనా శిక్షణ ఉంటే, అభ్యర్థులంతా రైతుల మీటింగ్ అయిపోయే వరకు ఆరుబయట కాలక్షేపం చేయాల్సిందే.
● ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక శిక్షణ మొక్కుబడిగా సాగుతుంది.
పొరుగు జిల్లాలో ఎలా ఉందంటే..
● ఇదే శిక్షణ పొరుగున ఉన్న జిల్లాలో చాలా పద్ధతిగా సాగుతోంది. డెస్క్లు ఉన్న కుర్చీలు, బేంచీలు, సిమెంట్ భవనాలు ఉండడంతో శిక్షణ బాగుంది. కొందరు అభ్యర్థులు ఇక్కడ వసతులు లేవని పొరుగు జిల్లాలకు వెళ్లిపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు పూర్తిస్థాయి భూమి కొలతల శాఖ అధికారి లేక ఇన్చార్జి అధికారి పర్యవేక్షిస్తున్నారు.
కలెక్టర్ గారూ.. చూడండి సారూ..
● భూభారతి చట్టంలో భాగంగా శిక్షణ పొందే లైసెన్స్డ్ సర్వేయర్ల శిబిరాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సందర్శిస్తే, అభ్యర్థుల సమస్యలు తీరనున్నాయి. ఇక్కడే మౌలిక వసతులు కల్పించడం, లేదా మరో కాలేజీలో వసతులు కల్పించి శిక్షణ ఇస్తే భావి సర్వేయర్లకు ప్రభుత్వం నిర్వహించే ‘పరీక్ష’ల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంది. లేకుంటే, శిక్షణ లోపాలు.. అభ్యర్థులకు శాపాలుగా మారనున్నాయి. శిక్షణపై జిల్లా కలెక్టర్ చొరవచూపాలని మహిళా అభ్యర్థులు కోరుతున్నారు.
చెప్పింది వినిపించదు.. రాసింది కనిపించదు
వర్షం పడితే బొలబొల.. ఎండకొడితే చిటచిట
డెస్క్ల్లేని కుర్చీలు.. కంపు కొడుతున్న మరుగుదొడ్లు
చంద్రంపేట రైతు వేదికలో భావి సర్వేయర్ల శిక్షణ తీరిదీ
భూ భారతి చట్టం అమలుకు మొక్కుబడి తర్ఫీదు
శిక్షణలో
ఇబ్బందులు ఉన్నాయి
‘ఇతడి పేరు సీహెచ్ సంతోష్. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన సంతోష్ హైదరాబాద్లో బీటెక్(ఈసీఈ) చదివారు. ప్రభుత్వం భూభారతి చట్టంలో లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ శిక్షణ పొందేందుకు రూ.5,200 ఆన్లైన్లో చెల్లించారు. 50 రోజుల శిక్షణలో భూమి కొలతలు చేయడం, నక్షాల తయారీ వంటి అంశాలను నేర్చుకోవాల్సి ఉంది. కానీ సిరిసిల్ల శివారులోని చంద్రంపేట రైతు వేదికలో శిక్షణ ఇవ్వడంతో అక్కడ మౌలిక వసతులు లేక మైకులో చెప్పింది వినిపించక, బోర్డుపై రాసింది కనిపించక ఇబ్బందులు పడుతున్నారు.’
‘నేలపై కూర్చుని రాస్తున్న ఈ అభ్యర్థులు భావి లైసెన్స్డ్ సర్వేయర్లు. చంద్రంపేట రైతు వేదికలో కూర్చుని మ్యాప్లు వేసుకోడానికి, రికార్డులు రాసుకోడానికి ఎలాంటి డెస్క్లు లేక ఇలా నేలపై కూర్చుని రికార్డులు రాస్తున్నారు. కూర్చునే కుర్చీల్లోనే అభ్యర్థులను కూర్చోబెట్టి థియరీ చెబుతుండగా.. చెప్పింది అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ వర్క్లో భాగంగా భూమి కొలతలు చేయడం బాగున్నా, రైతు వేదికలో శిక్షణ.. డబ్బులు చెల్లించి వచ్చిన అభ్యర్థులకు ‘శిక్ష’లా మారింది. ఇది ఏ ఒక్కరిద్దరు కాదు.. జిల్లాలో శిక్షణ పొందుతున్న 156 మంది అభ్యర్థులదీ ఇదే దుస్థితి.’
చంద్రంపేట రైతు వేదికలో శిక్షణకు ఇబ్బందులు ఉన్నాయి. జిల్లాలో చాలా భవనాలను శిక్షణ కోసం అడిగాము. ఎవ్వరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇది 50 రోజుల కార్యక్రమం. మరో పది రోజుల తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో శిక్షణను మరేదైనా భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. జూలై 26 వరకు శిక్షణ ఉంటుంది.
– వెంకట్రెడ్డి, భూముల సర్వేశాఖ జిల్లా అధికారి

అయ్యో.. ఇదేం శిక్షణ

అయ్యో.. ఇదేం శిక్షణ

అయ్యో.. ఇదేం శిక్షణ