
రాజన్న ఆలయం మూసివేయడం లేదు
● భీమేశ్వరాలయంలో దర్శనాలకు ఏర్పాటు ● ఆలయ విస్తరణపై అవగాహన ● రూ.76కోట్ల పనులకు త్వరలో టెండర్లు ● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం మూసివేయడం లేదని, ఆలయ విస్తరణపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పట్టణవాసులు, భక్తులు, ప్రజలందరికీ అవగాహన కల్పించనున్నట్లు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ విస్తరణ, భీమేశ్వరాలయంలో దర్శనాల ఏర్పాట్లపై ఆలయ గెస్ట్హౌస్లో దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు, వీటీడీఏ వైస్చైర్మన్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, స్థపతి వల్లినాయగం, ఈవో వినోద్రెడ్డి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్తో సమావేశం అయ్యారు. రూ.76కోట్లతో ఆలయ విస్తరణ పనులకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయాన్ని మూసివేయమని స్పష్టం చేశారు. స్వామివారికి నిత్య పూజలు కొనసాగుతాయన్నారు. ఆలయంలో పనులు చేపట్టనున్న దృష్ట్యా భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శనానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భీమేశ్వరాలయంలో నిత్య కల్యాణం షెడ్లు, భక్తుల దర్శనం క్యూలైన్లు, కోడెమొక్కుల క్యూలైన్లు, ఆలయ ఆవరణలో షెడ్లు తదితరుల వసతులు వంటి మొత్తం ఎనిమిది అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. విశాలమైన స్థలం, ఆధునిక సౌకర్యాలతో గోశాలలు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించగా, స్థానికంగా స్థలం గుర్తించాలని చర్చించామన్నారు. రాజన్న ఆలయ సమీపంలో కిలోమీటర్ పరిధిలో పెద్దపెద్ద భవనాలు నిర్మించవద్దని గతంలో జారీ చేసిన జీవోను 100 మీటర్ల పరిధిని కుదించాలని చర్చించినట్లు తెలిపారు. రాజన్న ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కోడలకు పచ్చి గడ్డి ఇవ్వాలని, నాణ్యమైన దాన పెట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించి, మందులు అందజేయాలని ఆదేశించారు.