
గీతా శ్లోక పఠన విజేతలకు సత్కారం
సిరిసిల్లకల్చరల్: భగవద్గీతలోని 700 శ్లోకాలను అవలీలగా పఠించి మైసూర్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో బంగారు పతకాలు సాధించిన జిల్లాకు చెందిన ఐదుగురు మహిళలను గీత ప్రచార సమితి సోమవారం ఘనంగా సత్కరించింది. పట్టణానికి చెందిన నార్ల సంతోషి, కటకం లక్ష్మి, కటకంవిజయ, జి. సంగీత, జి ప్రశస్తిలు భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేశారు. మైసూర్ ఆశ్రమంలో ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. వీరిని సమితి స్థానిక మళయాళ సద్గురు గీతాశ్రమంలో శ్రీ నారాయణ నందగిరి స్వామి చేతుల మీదుగా సత్కరించారు. సమితి అధ్యక్ష, కార్యదర్శులు కోడం నారాయణ, డాక్టర్ జనపాల శంకరయ్య, మోర దామోదర్, గజ్జెల్లి రామచంద్రం, కొక్కుల రాజేశం, గడ్డం కౌసల్య, అనసూయ, పత్తిపాక హరికిషన్ పాల్గొన్నారు.