జెండా పండుగ అతిథులు వీరే | - | Sakshi
Sakshi News home page

జెండా పండుగ అతిథులు వీరే

May 31 2025 12:54 AM | Updated on May 31 2025 3:19 PM

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌లు జెండా ఆవిష్కరించనున్నారు.

వేములవాడ సబ్‌రిజిస్ట్రార్‌గా విజయభాస్కర్‌

వేములవాడ: వేములవాడ సబ్‌ రిజిస్ట్రార్‌గా దేవరం విజ యభాస్కర్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన వేములవాడకు ప్రమోషన్‌పై వచ్చారు.

నీరు నిల్వ ఉండకుండా చూడాలి

జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత

సిరిసిల్ల: కొబ్బరి బొండాలు, కూలర్లు, డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌.రజిత కోరారు. సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం డ్రై డేలో భాగంగా ప్రగతినగర్‌లో తనిఖీలు చేశారు. ఇంటి వద్ద ఉండే నీటితొట్లు, డ్రమ్ములు, ఆరు బయట పరిసరాలను పరిశీలించారు. డెంగీ, మలేరియా జ్వరాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అనిత, మలేరియా సూపర్‌వైజర్‌ లింగం, వాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

కోనరావుపేట(వేములవాడ): విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు గరిష్ట ధర(ఎమ్మార్పీ) కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధి కారి అఫ్జల్‌ బేగం హెచ్చరించారు. కోనరావుపేట, నిజామాబాద్‌, ధర్మారం గ్రామాల్లోని ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నాణ్యమైన విత్తనాలు అందించాలని ఫర్టిలైజర్‌ దుకాణాదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్‌షిప్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తనాల ధరలు, స్టాక్‌ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. తనిఖీలలో స్థానిక మండల వ్యవసాయ అధికారి సందీప్‌ పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ అకాడమీ హాస్టళ్లలో ప్రవేశాలకు ఎంపికలు

సిరిసిల్లకల్చరల్‌: రాష్ట్ర క్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ స్పోర్ట్స్‌ అకాడమీలు, హాస్టళ్లలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖాధికారి అజ్మీర రాందాస్‌ శుక్రవారం తెలిపారు. సిరిసిల్ల వాలీబాల్‌ అకాడమీ కోసం రాజీవ్‌నగర్‌ మినీస్టేడియంలో జూన్‌ 10న జరిగే పోటీల్లో 14 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు పాల్గొనాలని తెలిపారు. జూన్‌ 1న సిద్దిపేట అకాడమీ, జూన్‌ 12, 13న మహబూబ్‌నగర్‌ స్టేడియం, 10, 11న సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌ ఓయూ క్యాంపస్‌, ప్రాంతీయ క్రీడా వసతి గృహం హనుమకొండ, 12న వనపర్తి హాకీ అకాడమీ, ఖమ్మం అథ్లెటిక్స్‌ అకాడమీలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఆర్టీసీ బస్టాండ్‌లో పార్కింగ్‌కు టెండర్లు

సిరిసిల్లటౌన్‌: ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో వెహికిల్‌ పార్కింగ్‌, క్యాంటీన్‌ నిర్వహణ, ఎల్లారెడ్డిపేటలో వెహికిల్‌ పార్కింగ్‌, ముస్తాబాద్‌లో మొబైల్‌ షాప్‌ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఎం ప్రకాశ్‌రావు తెలిపారు. సిరిసిల్ల డిపోయార్డ్‌, గ్యారేజీలలో స్వీపింగ్‌, క్లీనింగ్‌ కాంట్రాక్టు వర్క్‌ కోసం టెండర్‌పత్రాలు డిపో మేనేజర్‌ ఆఫీసులో విక్రయిస్తున్నట్లు తెలిపా రు. 99493 73819, 86868 69005 నంబర్‌లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement