
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలు చేయాలి
● రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వైద్యపరీక్షలు చేయాలని, ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో 2డీ–ఇకో పరీక్షలతోపాటు అన్నీ పరీక్షలు చేయాలన్నారు. డయాగ్నోస్టిక్ హబ్లో అన్ని రకాల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, శాంపిల్స్ సేకరణ, రిపోర్ట్ వేగంగా అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, టెక్నీషియన్స్ తాత్కాలిక ప్రాతిపదికన ఎక్కువ వేతనం అందించి నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించి, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సదరం క్యాంపులను ఎప్పటికప్పుడు నిర్వహించి దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. వేములవాడ ఆస్పత్రిలో మోకాల ఆపరేషన్ విజయవంతంగా జరుగుతున్నాయని, సిరిసిల్ల ఆస్పత్రిలోనూ ఇలాంటి ఆపరేషన్లు జరగాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్.రజిత, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సమీక్షించారు. జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం చేయడంలో పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, కలెక్టరేట్ ఏవో రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.