
గాలివాన.. తడిసిన ధాన్యం
● చిత్తడిగా మారిన సిరిసిల్ల ● రోడ్లపై పారిన డ్రెయినేజీలు ● కోనరావుపేటలో అత్యధికంగా 40.6 మిల్లీమీటర్ల వర్షం
సిరిసిల్ల: జిల్లాలో బుధవారం కురిసిన గాలివానతో సిరిసిల్ల పట్టణం చిత్తడిగా మారగా.. మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్ కవర్లు కప్పేందుకు నానా తిప్పలు పడ్డారు. సిరిసిల్లలోని సంజీవయ్య విగ్రహం వెనకాల మురికినీరు రోడ్డుపైన పారింది. ఆటోనగర్, కుమ్మరిగల్లీ, ఆసిఫ్పుర, శాంతినగర్ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు చిత్తడిగా మారాయి. పట్టణంలోని పైభాగంలో ఉన్న ప్రాంతాల మురికినీరు లోతట్టు ప్రాంతాలకు చేరి రోడ్డు ఎక్కడంతో పట్టణంలోని పలు రోడ్లు అడుగువేయలేని స్థితికి చేరుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఈ మురికి కష్టాలు సిరిసిల్ల పట్టణ ప్రజలకు తప్పడం లేదు. లక్ష జనాభాతో 39 వార్డులతో విస్తరించి ఉన్న సిరిసిల్లలో ప్రజల అవసరాల మేరకు మురికి కాల్వల విస్తరణ చేయకపోవడంతో ఈ అగచాట్లు తప్పడం లేదు.
ముందే పలకరించిన తొలకరి
జిల్లాను తొలకరి జల్లులు ముందే పలకరించాయి. ఏటా మే 25న రోహిణీ కార్తె ప్రవేశంతో వానాకాలం మొదలవుతుంది. కానీ ఈ ఏడాది నాలుగు రోజుల ముందుగానే వర్షం కురవడం విశేషం. ఇన్నాళ్లు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ జిల్లా జనం బుధవారం కురిసిన భారీ వర్షంతో చల్లబడ్డారు.
ధాన్యం కుప్పల్లోకి నీరు
వేములవాడ/ఇల్లంతకుంట/కోనరావుపేట/ ఎల్లారెడ్డిపేట/రుద్రంగి/వేములవాడరూరల్/ చందుర్తి/బోయినపల్లి: వేములవాడ పట్టణంలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.
● ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు పెద్దలింగాపూర్, కందికట్కూర్, రేపాక, గాలిపల్లి, వంతడుపుల గ్రామాల్లో వర్షం కురిసింది. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ వద్ద బీటీ రోడ్డుపై లోతట్టుగా వర్షం నీరు నిలిచింది. అనంతారం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. నెల రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చామని, మిల్లుకు తరలించడం లేదని రైతులు బైరి అనిల్, జలాలుద్దీన్ తెలిపారు.
● కోనరావుపేట, రుద్రంగి, వేములవాడరూరల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలు తడిసిపోయాయి.
● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కేసీఆర్ కాలనీ వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సెస్ అధికారులు పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.
● చందుర్తి మండలం బండపల్లి–ఎన్గల్ గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డుపై చెట్టు కూలిపోతే స్థానికుల సహాయంతో తొలగించారు. కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారి చందుర్తి శివారులో చెట్లు కూలిపోయాయి.
● బోయినపల్లి మండలం దుండ్రపల్లి, గుండన్నపల్లి గ్రామాల్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. గుండన్నపల్లి, దుండ్రపల్లిల్లోని ధాన్యం కుప్పల చుట్టూ పెద్ద మొత్తంలో వర్షపు నీరు నిలిచింది.
వర్షం ఇలా..(మి.మీ..)
రుద్రంగి : 25.3
చందుర్తి : 35.9
వేములవాడ రూరల్ : 9.0
బోయినపల్లి : 12.9
వేములవాడ : 23.1
సిరిసిల్ల : 16.3
కోనరావుపేట : 40.6
వీర్నపల్లి : 35.3
ఎల్లారెడ్డిపేట : 15.3
గంభీరావుపేట : 22.3
ముస్తాబాద్ : 4.9
తంగళ్లపల్లి : 14.6
ఇల్లంతకుంట : 12.1

గాలివాన.. తడిసిన ధాన్యం

గాలివాన.. తడిసిన ధాన్యం

గాలివాన.. తడిసిన ధాన్యం