
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
వేములవాడఅర్బన్: ఆస్పత్రికొచ్చే రోగులకు అన్నిరకాల నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ ఏరియా ఆస్పత్రి వైద్యులతో శనివారం సమావేశమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్వోసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్లకు పైగా మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓపీ సేవల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. మోకాళ్ల సర్జరీలు విజయవంతంగా పూర్తి చేయడంపై వైద్యులను అభినందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య, వైద్యుడు సంతోష్చారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రభుత్వంతో కలసిరండి
వేములవాడ: ప్రజా ప్రభుత్వంతో కలిసిరావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 50 మంది శనివారం కాంగ్రెస్లో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పారు. కులగణన చేపట్టి దేశానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో దీక్షలో కూర్చున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు.