
నిబంధనలు పాటించాలి
సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. మంగళవారం పీసీపీఎన్డీటీ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నిబంధనలు వ్యతిరేకంగా నిర్వహించే, లింగనిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తామన్నారు. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పీసీపీఎన్డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతూరు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతిప్రకాష్ శుక్లా, ఎన్జీవో కమిటీ సభ్యురాలు ఝాన్సీలక్ష్మి, డిప్యూటీ డెమో రాజ్కుమార్, హెచ్ఈ బాలయ్య, డీఈవో మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరం
సిరిసిల్లకల్చరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వేసవి సెలవుల్లో వివిధ క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం నుంచి శిబిరాల నిర్వహణ ప్రారంభమవుతుందని జిల్లా క్రీడాధికారి అజ్మీర రాందాస్ తెలిపారు. మే 1 నుంచి జూన్ 6వరకు జరిగే శిక్షణ శిబిరం రాజీవ్నగర్లోని మినీ స్టేడియంలో కొనసాగుతుంది. అథ్లెటిక్స్, కరాటే, యోగా, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్బాల్, ఆర్చరీ, కబడ్డీ, క్యారమ్స్, చెస్ మొదలైన క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు జరిగే శిబిరాల్లో ఆసక్తి గల బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణ
సిరిసిల్లకల్చరల్: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త నిర్వహణలో వివిధ వృత్తి రంగ కోర్సుల్లో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఎలక్ట్రీషియన్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్, సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్, సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సీసీ టీవీ టెక్నీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోసి, క్విల్ట్ బ్యాగ్స్ మేకింగ్ రంగాల్లో ఆరునెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతీ, యువకులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలోని సంస్థ కార్యాలయంలో మే 7న ఉదయం 10 గంటలకు సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 91339 08000, 91339 08111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేటి నుంచి ‘ఉపాధి’ సిబ్బంది పెన్డౌన్ సమ్మె
సిరిసిల్ల: ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని, వెంటనే వేతనాలు మంజూరు చేయాలని మంగళవారం ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు వినతిపత్రం అందించారు. జేఏసీ అధ్యక్షుడు గుడిసెల రమేశ్ మాట్లాడుతూ, నాలుగు నెలలుగా జీతాలు రాక పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న ఉద్యోగుల జీతాలు ఇవ్వకుండా జాప్యం చేయడంపై అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు అందించామని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో బుధవారం నుంచి పెన్డౌన్, షట్ డౌన్ సమ్మె చేస్తున్నామని, మే 2న చలో సీఆర్డీ ప్రజాభవన్ ముట్టడికి వెళ్తామని, 3న మంత్రులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. నాలుగు నెలల వేతనాలు విడుదల చేయాలని కోరారు. డీఆర్డీవో శేషాద్రికి వినతిపత్రం ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీవోలు, ఈసీలు, సీవోలు, టీఏలు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి