
● తెలంగాణకు అసలు విలన్ కేసీఆర్ అని ప్రజలు తేల్చారు ●
సిరిసిల్ల: రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టలేదని, దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు పుట్టిందని, ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్స్లో మంగళవారం పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ను అన్ని స్థాయిల్లోనూ పునఃనిర్మాణమే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందన్నారు. వరంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అని అనడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రజలే కేసీఆర్ను విలన్గా భావించి ఎన్నికల్లో పక్కన పెట్టారని అన్నారు. ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులరిజం పార్టీగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పని చేస్తుందన్నారు. దేశంలో రాజ్యాంగం, జుడీషియరీ, పార్లమెంట్ వ్యవస్థలన్నీ ప్రమాదంలో ఉన్నాయని, వాటిని రక్షించుకునేందుకు కాంగ్రెస్ను అధికారంలోకి తేవాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడి పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. నాయకులు సమన్వయంతో పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదపడాలన్నారు.
ఉమేశ్రావు మాటలతో వాగ్వాదం
ఎన్నికల్లో ఓడిపోయే నాయకులకే టిక్కెట్లు ఇస్తున్నారని, గెలిచే అభ్యర్థులను గుర్తించాలని కాంగ్రెస్ నాయకులు చీటి ఉమేశ్రావు మాటలతో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. పరోక్షంగా ఆయన కేకే మహేందర్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్లు గుర్తించిన పార్టీ నాయకులు ఉమేశ్రావుతో వాగ్వాదానికి దిగారు. విప్ ఆది శ్రీనివాస్ వారిస్తున్నా నాయకులు శాంతించలేదు. ఉమేశ్రావు స్టేజీ దిగాలని నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అంతకు ముందు నాయకులు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో జై భీమ్.. జై బాపూ.. జై సంవిధాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్కు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేశారు. ఏఐసీసీ పరిశీలకులు ఫకృద్దీన్, కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, అకునూరి బాలరాజు, కూస రవీందర్, గడ్డం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్లు స్వరూపారెడ్డి, శ్రీనివాస్, కచ్చకాయల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.