
‘ఉద్యానం’ ఉపాధి
● పండ్ల తోటలు.. కూరగాయలతో లాభాలు ● ఆయిల్పామ్ సాగుతో ప్రయోజనాలు ● రైతులకు రాయితీ .. ప్రణాళిక ఖరారు
సిరిసిల్ల: వరి, పత్తి పంటలే కాకుండా.. ఉద్యానపంటలతో నమ్మకమైన ఉపాధి పొందవచ్చు. రైతులు ఆసక్తి చూపితే సిరులు పండించవచ్చు. ప్రభుత్వం సైతం రాయితీ కల్పిస్తోందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సాగుప్రణాళికను ఉద్యానశాఖ అధికా రులు ఖరారు చేశారు. వివరాలను జిల్లా ఉద్యానశాఖ అధికారి కేఆర్ లత వివరించారు.
సమగ్ర ఉద్యాన మిషన్ పథకం
పండ్ల తోటల పెంపకానికి 50 శాతం, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40 శాతం సబ్సిడీ ఉంటుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డ్రాగన్ఫ్రూట్ తోటలను 12.50 ఎకరాలు, బొప్పాయి 22.50 ఎకరాలు, మామిడితోటలు 25 ఎకరాల్లో పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జామ తోటలు ఐదెకరాలు, కూరగాయల నారు కోసం 87.50 ఎకరాలు, పూలు 47.50ఎకరాలు, సుగంధ ద్రవ్యాల విత్తనాల కోసం 17.50 ఎకరాలు, మామిడితోటల పునరుద్ధరీకరణకు 50 ఎకరాలు, మల్చింగ్ కోసం 125 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిముట్లు పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, పవర్స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లకు రాయితీ ఉంటుంది.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
కూరగాయల సాగుకు శాశ్వత పందిరి నిర్మాణానికి 2025–26లో 30 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. వెదురు మిషన్ పథకంలో పొలాల సరిహద్దులపై 2వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్లను జత చేయాల్సి ఉంటుంది.
ఆధునిక విధానంలో సాగు..
పండ్లు, కూరగాయలు, పూలతోటల పెంపకం, మ ల్చింగ్, పాతతోటల పునరుద్ధరణ, ఉద్యాన యాంత్రీకరణ, జాతీయ వెదురు మిషన్ ద్వారా తోటల చుట్టూ వెదురుచెట్లు నాటించడం కోసం ఉద్యానశాఖ కార్యాచరణ రూపొందించింది.
ఆయిల్పామ్
ఆయిల్పామ్ తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రో త్సహిస్తుంది. ఒక ఆయిల్పామ్ మొక్కకు ఖరీదు రూ.193 ఉండగా.. రైతు రూ.20 చెల్లిస్తే ప్రభుత్వం రూ.173 చెల్లిస్తుంది. ఎకరానికి 50 మొక్కల నాటుతారు. ఆయిల్పామ్స్లో అంతర పంటలకు, పంట ల నిర్వహణకు ఎకరాకు రూ.4,200 చొప్పున ఏటా చెల్లిస్తుంది. ఇలా నాలుగేళ్లు రాయితీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఈ ఏడాది 2వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్లు, కూరగాయలు, ఇతర తోటలకు బిందు సేద్యానికి 437 ఎకరాలు, తుంపర సేద్యానికి 212 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
సూక్ష్మ, బిందు సేద్యం సబ్సిడీ ఇలా..
రైతులు సబ్సిడీ
ఎస్సీ, ఎస్టీ వంద శాతం
సన్న, చిన్నకారు 90 శాతం
ఇతరులు 80 శాతం
సంప్రదించాల్సిన అధికారులు
సిరిసిల్ల గోవర్ధన్ 89777 14049
వేములవాడ లోకేశ్ 89777 14048
తక్కువ నీటితో ఎక్కువ పంటలు
జిల్లాలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలు సాగుచేస్తే ప్రభుత్వం తరఫున రాయితీలు లభిస్తాయి. కూరగాయలు, పండ్లతోటల సాగుతో లాభాలు ఉంటాయి. ఆయిల్పామ్ సాగుతో బహుముఖ ప్రయోజనాలున్నాయి. జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఆసక్తి గల రైతులు ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి.
– కె.ఆర్.లత, జిల్లా ఉద్యానశాఖ అధికారి

‘ఉద్యానం’ ఉపాధి