హద్దుల్లేని మైనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

హద్దుల్లేని మైనింగ్‌

Jun 7 2025 12:06 AM | Updated on Jun 7 2025 12:06 AM

హద్దు

హద్దుల్లేని మైనింగ్‌

● ఈటీఎస్‌ సర్వేలో వెలుగులోకి అక్రమాలు ● జిల్లాలోని వ్యాపారులకు రూ.129కోట్ల జరిమానా ● అభివృద్ధి పనులకు కంకర సరఫరా చేశామని లెక్కలు ● జరిమానాలు తప్పించుకునేందుకు యత్నం

సిరిసిల్ల: జిల్లాలో మైనింగ్‌ హద్దులు దాటింది. గనుల గడువు ముగిసినా అక్రమ తవ్వకాలు సాగించారు. నిర్ణయించిన హద్దులను దాటి తవ్వకాలు చేపట్టారు. రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో క్వారీల యాజమాన్యాలు ఆడింది ఆటగా చెలామణి అయింది. ప్రభుత్వానికి సీనరేజీ, రాయల్టీ చెల్లించలేదు. జిల్లాలోని 14 క్వారీలకు, 9 క్రషర్లకు గడువు దాటిపోయిందని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. కొన్నింటిని ఏకంగా నిషేధిత జాబితాలో పెట్టారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది.

క్రషర్లలో నలిగిన నిబంధనలు

జిల్లాలో నిబంధనల మేరకు మైనింగ్‌శాఖ 2020లో మైనింగ్‌కు అనుమతించింది. వీటి గడువు ఇప్పటికే ముగిసిపోయింది. 1994 ఆదేశాల మేరకు ఐదు హెక్టార్లకు మించి ఖనిజాల తవ్వకాలు సాగిస్తే పర్యావరణ అనుమతులు పొందాలి. కానీ జిల్లాలో ఆ నిబంధనలు అమలుకావడం లేదు. రోడ్లు, భవనాల నిర్మాణాలకు అవసరమైన అన్ని సైజుల కంకర తయారీ కాగా.. క్రషర్లలో నిబంధనలు పాటించలేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన మైనింగ్‌ అధికారులు జిల్లాలోని పలు స్టోన్‌ క్రషర్లకు నోటీసులు ఇచ్చారు. వీటిపై యజమానులు కోర్టుకు వెళ్లగా యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

పక్క‘దారుల్లో’

అక్రమార్కులు

జిల్లాలో అక్రమ మైనింగ్‌తో గుట్టలను గుల్లచేసిన అక్రమార్కులకు జిల్లాలో రూ.129కోట్ల జరిమానాలు విధించారు. ఈమేరకు ఆయా స్టోన్‌క్రషర్లకు నోటీసులు జారీచేసి వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) అవకాశం కల్పించారు. అక్రమార్కులు దోచుకున్న సీనరేజీ, రాయల్టీ పన్నులను చెల్లించాల్సి వస్తోందని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు అన్ని సైజుల కంకరను సరఫరా చేసినట్లు చెబుతున్నారు. ఈమేరకు పక్క‘దారులు’ వెతుకుతున్నారు. ఏ అభివృద్ధి పనికి ఎంత మేరకు సరఫరా చేశారో వివరాలు ఇవ్వాలని మైనింగ్‌ అధికారులు కోరగా.. ఆ లెక్కలను అందించే పనిలో పడ్డారు.

గనుల స్వరూపం

కలర్‌ గ్రానైట్‌ లీజులు : 24

రాయి(కంకర) లీజులు : 16

పట్టాభూములు : 40.14 హెక్టార్లు

ప్రభుత్వ భూములు : 103.43 హెక్టార్లు

2023–2024 ఆదాయం : రూ.16.72 కోట్లు

2024–2025 ఆదాయ లక్ష్యం : రూ.18.77 కోట్లు

ఆరుగురు వివరాలు అందించారు

జిల్లాలో 14 క్వారీలు, 9 స్టోన్‌క్రషర్లు ఉన్నాయి. నిబంధనలు పాటించకుండా తవ్వకాలు సాగించిన వారికి నోటీసులు జారీ చేశాం. క్వారీల్లో ఈటీఎస్‌ సర్వే నిర్వహించాం. డిజిటల్‌ సర్వే ద్వారా అక్రమ మైనింగ్‌ను నిర్ధారించి జరిమానాలు విధించాం. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మెటీరియల్‌ సరఫరా చేశామని ఆరుగురు మాత్రమే వివరాలు అందించారు. మిగతా వారు ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం.

– క్రాంతికుమార్‌, జిల్లా గనులశాఖ అధికారి, రాజన్న సిరిసిల్ల

హద్దుల్లేని మైనింగ్‌1
1/2

హద్దుల్లేని మైనింగ్‌

హద్దుల్లేని మైనింగ్‌2
2/2

హద్దుల్లేని మైనింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement