
మట్టే బంగారమాయే !
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో మట్టి దందా జో రుగా సాగుతోంది. గుట్టలు కరిగిపోతుండగా.. చె రువులు, కుంటలు ఖాళీ అవుతున్నాయి. మైనింగ్ అ ధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో స్మగ్లర్లకు మట్టి కాసులు కురిపిస్తోంది. అనుమతులు లేకుండా తరలిస్తున్న స్మగ్లర్లు ట్రిప్పునకు రూ.4వేలు వసూలు చేస్తున్నారు. ఇంత వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి పన్నులు మాత్రం చెల్లించడం లేదు.
యథేచ్ఛగా రవాణా
● జిల్లాలో మట్టిదందా యథేచ్ఛగా సాగుతోంది. ఎల్లారెడ్డిపేట మండలంలో నిత్యం 20 నుంచి 25 ట్రిప్పుల వరకు మట్టి తరలిపోతుంది. ఒక్క ఎల్లారెడ్డిపేట మండలంలోనే ప్రతీ రోజు రూ.లక్ష వరకు వ్యాపారం జరుగుతుందంటే జిల్లా వ్యాప్తంగా ఇంకెంత జరుగుతుందో అంచనా వేయొచ్చు.
● జిల్లాలో వేములవాడ చుట్టుపక్కల గ్రామాల్లో మట్టి దందా జోరుగా సాగుతోంది. వేములవాడ శివారు ప్రాంతాలు, అగ్రహారం, బోయినపల్లి మండలాల్లో మట్టి దందా సాగుతోంది.
● చందుర్తి, రుద్రంగి మండల కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు మట్టి తరలిపోతుంది.
● గ్రామాల్లోని సహజవనరులు ధ్వంసమవుతున్నాయి.
పడిపోతున్న భూగర్భజలాలు
చెరువులు, కుంటలు, గుట్టల నుంచి మట్టి తరలిస్తుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గతంలో మానేరువాగు ఏడాది పొడవునా నీరు పారేది. కానీ నేడు వర్షాకాలంలోనూ నీటిదార కనిపించలేదు. పంట పొలాల్లో బోరుబావులు వట్టిపోతున్నాయి. కొత్తగా 400 నుంచి 500 ఫీట్ల వరకు వేస్తేనే బోరుబావుల్లో నీటిదారలు కనిపిస్తున్నాయి. సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి మట్టిదందాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
స్మగ్లర్లకు కాసులు కురిపిస్తున్న దందా
అక్రమంగా వ్యాపారం
ప్రభుత్వ ఆదాయానికి గండి
మాయమవుతున్న గుట్టలు
పట్టించుకోని మైనింగ్ అధికారులు

మట్టే బంగారమాయే !