
సారూ.. చీరలు అడ్డుపెట్టుకుంటున్నాం
● ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోండి ● ‘డబుల్’ లబ్ధిదారుల వేడుకోలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘సారూ..చీరలు అడ్డుపెట్టుకుని ఉంటున్నాం. వానకు..చలికి ఇబ్బంది పడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు వస్తే గోడలు కట్టుకుంటాం.. ఆదుకోండి..’ అంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ అనుబంధ చింతాలపల్లి గ్రామానికి చెందిన సావనపల్లి నర్సవ్వ వేడుకుంటుంది. ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే ఉన్న పాత ఇంటిని కూలగొట్టి.. 25 గుంటల భూమి అమ్మి కొత్తగా ఇంటి పనులు మొదలుపెట్టినట్లు తెలిపింది. స్లాబ్ వరకు పనులు జరిగి ఆగిపోయాయని.. మూడేళ్లుగా స్లాబ్ చుట్టూ పాతచీరలు, పరదాలు కట్టుకుని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. వర్షాకాలం, చలికాలంలో ఉండలేకపోతున్నామని కన్నీరుమున్నీరయ్యారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్రెడ్డి స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు.