కొత్త కోర్సు.. ఉపాధి చూపు | - | Sakshi
Sakshi News home page

కొత్త కోర్సు.. ఉపాధి చూపు

Jun 8 2025 12:46 AM | Updated on Jun 8 2025 12:46 AM

కొత్త

కొత్త కోర్సు.. ఉపాధి చూపు

● బీకాం విద్యార్థుల కోసం బీఎఫ్‌ఎస్‌ఐ ● గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో ప్రారంభం ● దోస్త్‌ విధానంలో ప్రవేశాలు ● విజ్ఞానంతోపాటు నైపుణ్యానికి ప్రాధాన్యత

గంభీరావుపేట(సిరిసిల్ల): వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో నిపుణులను తయారు చేసేందుకు డీగ్రీలో కొత్త కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సు ఉద్యోగావకాశాలు కల్పించే నైపుణ్యాలు అందించనుంది. ఈ కోర్సును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశపెట్టారు. గంభీరావుపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. దోస్త్‌ విధానంలో జరుగుతున్న ప్రవేశప్రక్రియలో బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులో చేరుతున్న విద్యార్థులు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌, ఇంటర్న్‌షిప్‌లు, బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్‌లు, ఇన్సూరెన్స్‌ పాలసీలు వంటి వాటిపై లోతైన అవగాహన పొందగలుగుతారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌ఎస్‌లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీ రంగాల్లో ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయంటున్నారు.

విజ్ఞానంతోపాటు నైపుణ్యానికి ప్రాధాన్యత

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విజ్ఞానంతోపాటు నైపుణ్యాలు అందించడంలో కొంత వెనుకబడిపోతున్నాం. ఈ నేపథ్యంలో బీకాం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సు ఒక కీలకమైన పరిష్కారంగా నిలుస్తోంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ రంగాల్లో టెక్నికల్‌ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగాల్లో నిపుణుల కొరతను తీర్చడానికి విద్యార్థులను తీర్చిదిద్దే కోర్సులు అవసరం. ఈ కోర్సు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం, మార్కెట్‌పై అవగాహన, క్లయింట్‌ హ్యాండ్లింగ్‌ మాదిరి నైపుణ్యాలను పెంచుతుంది.

కోర్సు విశేషాలు

డిగ్రీలో బీకాం చదవాలి అనుకునే విద్యార్థులు దోస్త్‌ ద్వారా అప్లయ్‌ చేసుకొని గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్‌ తరగతులతోపాటు అప్రెంటీస్‌షిప్‌ తరగతులు ఉంటాయి. దీంతో కంపెనీల్లో పనిచేసే అనుభవం పొందగలుగుతారు. మూడేళ్ల కోర్సు వ్యవధిలో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఫైనలియర్‌లో ఆరు నెలల శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.4వేల చొప్పున స్టైఫండ్‌ కూడా ఇస్తారు.

త్వరగా స్థిరపడాలనుకునే వారికి చక్కని అవకాశం

భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకొని త్వరగా స్థిరపడటానికి వీలు పడే కోర్సు బీఎఫ్‌ఎస్‌ఐ. ఈ కోర్సు స్పెషలైజేషన్‌ ద్వారా బ్యాంకింగ్‌ రంగం, ఆర్థిక సేవలు, బీమారంగాల్లో ప్రావీణ్యం పొందగలుగుతారు. గంభీరావుపేట కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టాం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– వి.విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, ప్రిన్సిపాల్‌, గంభీరావుపేట

కొత్త కోర్సు.. ఉపాధి చూపు1
1/1

కొత్త కోర్సు.. ఉపాధి చూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement