
ట్రస్ట్బోర్డు నిరీక్షణే !
● ‘పుష్కర’కాలంగా ఏర్పాటు చేయని ప్రభుత్వాలు ● ఏటా ఉత్సవ కమిటీలతోనే శివరాత్రి వేడుకల నిర్వహణ ● 800 ఏళ్ల చరిత్ర ఉన్న దక్షిణకాశీ.. అభివృద్ధిలో వెనుకంజ ● ఆదాయంలో ఘనం.. వసతులు అంతంతే.. ● టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం సన్నాహాలు
సిరిసిల్ల: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి 800 ఏళ్ల ఘన చరి త్ర. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగా రంగా నిలుస్తున్న స్వామి వారి ఆలయం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. నిత్యం వేలాదిగా తరలి వస్తున్న భక్తుల ద్వారా భారీగా ఆదాయం వ స్తున్నా వసతులు అంతంతే ఉన్నాయి. ట్రస్ట్బోర్డు లేక అభివృద్ధి సాధించలేకపోతోంది. పుష్కరకాలంగా ప్రభుత్వాలు ట్రస్ట్బోర్డును పట్టించుకోవడం లేదు. ఫలితంగా భక్తులకు సౌకర్యాలు దరిచేరడం లేదు.
12 ఏళ్లుగా ఊసేలేని ట్రస్ట్బోర్డు
వేములవాడ ఆలయ ట్రస్ట్బోర్డు లేక పన్నెండేళ్లు గడుస్తోంది. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మ వెంకన్నను ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా నియమించగా 2013 వరకు కొనసాగారు. అనంతరం రాజన్న ఆలయానికి ట్రస్ట్బోర్డు కమిటీ లేదు. ఏటా మహాశివరాత్రి వేడుకలకు ముందు ఉత్సవ కమిటీని నియమిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో ట్రస్ట్బోర్డు లేక ఆలయ అభివృద్ధి, నిర్వహణలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పూర్తిస్థాయి ధర్మకర్తల మండలిని నియమిస్తే ఆలయం అభివృద్ధిలో దూసుకెళ్తుందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఉత్సవ కమిటీలు తాత్కాలిక పనులు మాత్రమే చేస్తున్నాయి. ట్రస్ట్బోర్డు లేక శాశ్వత అభివృద్ధి పనులు సాగడం లేదు. దాతలను సమీకరించి సన్నిధిలో వసతిగృహాల నిర్మాణాలు, ఆధునిక హంగుల కల్పన వంటి పనులు సాగడం లేదు.
62 ఏళ్ల కిందటే ట్రస్ట్బోర్డు ఏర్పాటు
రాజన్న ఆలయంలో 1963లో అంటే.. 62 ఏళ్ల కిందటే తొలి ట్రస్ట్బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ధర్మకర్తల మండలిని నియమిస్తూ వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యమున్న ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ నియామకంపై ప్రభుత్వాలు ఆచీతూచీ నియమించాయి. 12 ఏళ్లుగా ట్రస్ట్బోర్డు కమిటీ లేక అధికారుల పర్యవేక్షణలో రాజన్న ఆలయ నిర్వహణ సాగుతోంది.
కలెక్టరేట్లో వీటీడీఏ ఆఫీస్
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)ని 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసింది. దీనికి సీఎం చైర్మన్గా, కలెక్టర్ వైస్ చైర్మన్గా ఉన్నారు. కానీ పూర్తిస్థాయిలో నిధులు కే టాయించకపోవడంతో వీటీడీఏ నామమాత్రంగా మారింది. వేములవాడ ఆలయ అభివృద్ధి ఆఫీస్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. గత నవంబరులో సీఎం రేవంత్రెడ్డి వేములవాడకు వచ్చి ఆలయ అభివృద్ధికి రూ.127కోట్లు కేయించారు. అయినా పనుల్లో ప్రగతి లేదు. ఏడు నెలల కిందటే సీఎం నిధులు మంజూరు చేయగా టెండర్లు కూడా పూర్తికాలేదు. వేములవాడలో రోడ్ల విస్తరణ, పుష్కరిణి అభివృద్ధి, గోశాల నిర్మాణం, విస్తరణ, మురికికాల్వల నిర్మాణాలు పెండింగ్లోనే ఉన్నాయి.
ట్రస్ట్బోర్డు ఉంటే...
ఆలయ అభివృద్ధిపై తరచూ సమీక్షలు.. ప్రొటోకాల్ నిర్వహణ, దాతల నుంచి విరాళాలు సేకరించి వస తి గదులు నిర్మించడం.. సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఆలయ ధర్మకర్తల మండలి నియాకమంపై ప్రభుత్వం జాప్యం చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఆలయ ట్రస్ట్బోర్డు ఊసే లేకుండా నెట్టుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. పుష్కరకాలంగా ట్రస్ట్బోర్డు ఏర్పాటులో పడిగాపులు తప్పడం లేదు.
వేములవాడ రాజన్న ఆలయ ముఖద్వారం
ట్రస్ట్బోర్డు చైర్మన్లు.. పదవీకాలం
సీహెచ్.వెంకటేశ్వర్రావు 1963–1977
ఎం.కొండల్రావు 1977–1980
సీహెచ్.వెంకటేశ్వర్రావు 1981–1984
వుచ్చిడి మోహన్రెడ్డి 1984–1987
దుగ్గిరాల వెంకట్రావు 1988–1990
వుచ్చిడి మోహన్రెడ్డి 1992–1994
సీహెచ్.కమలాకర్రావు 1994–1996
శికారి విశ్వనాథం 1998–1999
శికారి విశ్వనాథం 2002–2004
ఆది శ్రీనివాస్ 2004–2006
ఆది శ్రీనివాస్ 2007–2009
బొమ్మ వెంకన్న 2009–2013
టీటీడీ తరహాలో ఏర్పాటుకు సన్నాహాలు
వేములవాడ ఆలయ ట్రస్ట్బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేములవాడ, యాదగిరిగుట్ట ఆలయాలకు ధర్మకర్తల మండలి ఏర్పాటుపై ప్రభుత్వం కేబినెట్ స్థాయిలో చర్చించింది. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. పనులు జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
– ఆది శ్రీనివాస్,
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే

ట్రస్ట్బోర్డు నిరీక్షణే !