
మూడు నెలల్లోగా ఇళ్లు పూర్తి చేయాలి
● ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలు పొందిన లబ్ధిదారులు మూడు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇందిరమ్మ లబ్ధిదారులు గురువారం కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. మంజూరు పత్రాలు పొందిన వారికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని తెలిపారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇల్లు మొదలు పెట్టేందుకు, నిర్మాణ పనులకు డబ్బులు లేని వారికి రుణవసతి కల్పిస్తామన్నారు. బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లతో ఫొటో తీయించి, అప్లోడ్ చేయించాలని సూచించారు. బిల్లుల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. పీడీ హౌసింగ్ శంకర్, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, కాంగ్రెస్ నాయకులు పర్శ హన్మాండ్లు, బాల్రెడ్డి పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
వేములవాడఅర్బన్: జిల్లాలో ఎరువులు, విత్తనాలు నిబంధనలు ప్రకారం విక్రయించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడలోని హనుమాన్ ఎంటర్ర్పైజేస్, శ్రీలక్ష్మీ ట్రేడర్స్ విత్తనాల దుకాణాలు, గోదాములను గురువారం తనిఖీ చేసి మాట్లాడారు. శ్రీలక్ష్మీ ట్రేడర్స్లోని సేల్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. రిజిస్టర్లోని వివరాల ప్రకారం గోదాములో ఎరువులు లేనట్లు గుర్తించి అమ్మకాల నిలిపివేతకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సరైన సంజాయిషీ సమర్పించకపోతే షాప్ను సీజ్ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, మండల వ్యవసాయాధికారి సాయికిరణ్ ఉన్నారు.
కోడెలకు మెరుగైన వైద్యం అందించాలి
రాజన్న గోశాలలోని కోడెలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. గోశాలను గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గోశాల ఆవరణలో పారిశుధ్య పనుల నిర్వహణకు అదనంగా వర్కర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో వినోద్రెడ్డి ఉన్నారు. అనంతరం గోశాలలోని కోడెలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనిఖీ చేశారు. సువిశాలమైన ప్రదేశంలో గోశాలను నిర్మిస్తామని తెలిపారు. భక్తులు తెచ్చే కోడెలలో కొన్నింటికి లంపీస్కిన్ వ్యాధి ఉండడంతో పది రోజులపాటు క్వారంటైన్లో పెట్టిన తర్వాత మిగతా వాటితో కలపాలని సూచించారు.