
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కల్పించిన ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్ గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన జై భీమ్.. జై బాపు, జై సంవిధాన్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి రజతోత్సవ సభలు నిర్వహిస్తోందని విమర్శించారు. వారు ఎన్ని ఎత్తుగడలు వేసిన మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నోరు మూయించడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తూ.. మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు ఎస్కే గౌస్, శ్రీనివాస్, నంది కిషన్, సాహెబ్, బండారి బాల్రెడ్డి, దత్తాద్రిగౌడ్, మర్రి శ్రీనివాస్రెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.