
ఉద్యమస్ఫూర్తి..పాలనకీర్తి
● రజతోత్సవ వేళ బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలు ● నేడు ఊరూరా ఉద్యమజెండా ఆవిష్కరణలు ● వరంగల్ సభకు భారీగా తరలిపోతున్న జిల్లా గులాబీ శ్రేణులు ● పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పాతికేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పురుడుపోసుకుంది. ఉద్యమమే ఊపిరిగా ఎదిగిన టీఆర్ఎస్ కాలక్రమంలో బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ ఏర్పాటు.. ఆ తర్వాత రెండు పర్యాయాలు అధికారంలోకి రావడం తన పాతికేళ్ల వయసులో సాధించిన విజయాలుగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ల సందర్భంగా వరంగల్లో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిపోతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాతికేళ్ల అడుగుజాడలను జిల్లాలోని ఆ పార్టీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
2009లో కీలక పరిణామాలు
రాష్ట్ర సాధన ఉద్యమంలో 2009లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 7న సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంపు ఆఫీస్లో బసచేశారు. మరుసటి రోజు ఉదయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని నేరుగా హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. ఈక్రమంలో కేటీఆర్ క్యాంపు ఆఫీస్కు మళ్లీ వెళ్లే సమయం లేక దుస్తులను సిరిసిల్ల మానేరు వంతెనపైకి తెప్పించుకుని అక్కడే రోడ్డుపైనే మార్చుకున్నారు. సమయం.. విలువ తెలిసిన వ్యక్తిగా.. ఉద్యమ సారఽథిగా రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా బక్కపల్చని పెద్ద మనిషి కేసీఆర్ రోడ్డుపై బట్టలు మార్చుకుని వెళ్లడం అప్పట్లో చర్చగా మారింది.
నేడు జెండా
పండుగలు
రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 25వేల మందిని సమీకరించి వరంగల్కు తరలించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఆదివారం ఉదయం అన్ని గ్రామాల్లో జెండా పండుగలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు జెండా గద్దెలకు రంగులు వేసి సిద్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించి జై కేసీఆర్ నినాదాలు చేసి.. బస్సులు, వ్యాన్లలో పార్టీ శ్రేణులు ఎల్కతుర్తికి తరలివెళ్లనున్నాయి. ఎండల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు గ్రామాల్లోని మహిళలను కాకుండా.. యువకులను, యువరైతులను సభకు ఆహ్వానించారు. ఎండల నేపథ్యంలో మహిళలు ఇబ్బందులు పడతారని, వృద్ధులు వస్తే.. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
టెలీకాన్ఫరెన్స్
నిర్వహించిన కేటీఆర్
సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు శనివారం మధ్యాహ్నం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ సభకు వస్తున్న సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనాలను సమకూర్చుకున్న తీరును, సభ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంపై కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫోన్లో కేటీఆర్ మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో వరంగల్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ జిల్లా నాయకులు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల వారీగా, మండలాలు, గ్రామాల వారీగా సమీక్షించుకుంటూ.. జనసమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉద్యమస్ఫూర్తి..పాలనకీర్తి