
సాదాబైనామాలకు భూభారతితో పరిష్కారం
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల/గంభీరావుపేట(సిరిసిల్ల): పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు నూతన ఆర్వోఆర్ చట్టం భూభారతితో పరిష్కారం లభించనుందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. గంభీరావుపేటలోని రైతువేదికలో గురువారం నిర్వహించిన భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. పీవోటీ, ఎల్టీఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.100 అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని వివరించారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, తీర్పుపై సంతృప్తి చెందకపోతే సివిల్కోర్టుకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఆర్డీవో రాధాభాయి, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఆర్ఐలు గోపి, సత్యనారాయణ, ఎంఏవో సలావొద్దీన్ పాల్గొన్నారు. అనంతరం ముస్తఫానగర్, దేశాయిపేట గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలింపు నిమిత్తం రెండు వాహనాలను కేటాయించామని తెలిపారు.
రైతులు ఆందోళన చెందొద్దు
రైతులు ఆందోళన చెందొద్దని, పది రోజుల్లోపు వర్షాలు లేవని కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టం చేశారు. కలెక్టరేట్లో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 28వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో అపెరల్పార్క్తోపాటు అందుబాటులో ఉన్న గోదాములను గుర్తించి ధాన్యం నిల్వ చేయాలన్నారు. రైస్మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు. జిల్లాలో 500 లారీలు అందుబాటులో ఉన్నాయని, ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద రెండు లారీలను పెట్టాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత, అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎంలు పద్మయ్య, సుధారాణి, ఏపీఎంలు పాల్గొన్నారు.
అపెరల్ పార్క్ సందర్శించిన కలెక్టర్
అపెరల్ పార్క్ను కలెక్టర్ సందర్శించారు. అపెరల్ పార్క్లోని ఆరు షెడ్లు, 12 కంపార్టుమెంట్లను ధాన్యం నిల్వ చేసేందుకు సిద్ధం చేయాలని పౌరసరఫరాల డీఎం రజితను ఆదేశించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడింగ్ చేయాలని, హమాలీలకు తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు.