
పంచాయతీ కార్యదర్శి కథ సుఖాంతం
సిరిసిల్లక్రైం/తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్ నాయకుల వేధింపులతో అదృశ్యమైన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక కథ సుఖాంతమైంది. మూడు రోజుల క్రితం లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రియాంక ఆచూకీ కడప జిల్లాలో లభ్యమవడంతో కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా గురువారం ఉదయం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్న ప్రియాంక తనగోడును పోలీసుల ఎదుట వెల్ల బోసుకుంది. ఇప్పటికే సిరిసిల్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదుకాగా.. దర్యాప్తు జరుగుతోంది. ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నలుగురు వ్యక్తులు గుగ్గిళ్ల శ్రీకాంత్, గుగ్గిళ్ల అభి, మల్లేశ్, రాజు వేధింపులతోనే తన ఉద్యోగానికి రాజీనామా పంపి వెళ్లిపోయానని తెలిపారు. చేయని పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల కోసం ఒత్తిడి చేశారని వెల్లడించారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తాత్కాళిక పరిష్కారం మాత్రమే చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లను ప్రకటించాలని ఒత్తిడి చేశారని.. అది కుదరదని చెప్పడంతో అనేక మాటలన్నారని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఏకవచనంతో దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. దీనిపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా వారికే వత్తాసు పలికడం చిన్న స్థాయి అధికారులమైన తమకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. వేధింపులు భరించలేకే రాజీనామా పత్రాన్ని వాట్సాప్ ద్వారా ఉననతాధికారులకు పంపించినట్లు వివరించారు. కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటికై నా ఉద్యోగులతో ఎలా ఉండాలో పార్టీ పెద్దలు కింది స్థాయి నాయకులకు సూచించాలని కోరారు.
సిరిసిల్లకు చేరిన కార్యదర్శి ప్రియాంక
పట్టణ పోలీస్ స్టేషన్లో హాజరు