
ధర్మగుండంలో ఇలాగైతే ఎలా..
● బట్టలు ఉతుకుతున్న కొందరు భక్తులు ● ఇబ్బందులు పడుతున్న మిగతా వారు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. దాదాపు అందరూ ధర్మగుండంలోనే స్నానాలు చేసి దర్శనానికి వెళ్తారు. ధర్మగుండంలో స్నానాలాచరించడాన్ని భక్తులు అతి పవిత్రంగా భావిస్తారు. అయితే కొందరి చేష్టలతో మిగతా వారు ఇబ్బందులు పడుతున్నారు. ధర్మగుండంలో స్నానాలు మాత్రమే చేయాల్సి ఉండగా.. విడిచిన బట్టలను సైతం అక్కడే ఉతుకుతూ ఆరేస్తున్నారు. ఇలా ఇతరులు బట్టలు శుభ్రం చేసుకున్న నీటిలోనే స్నానం చేసేందుకు మిగతా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు భక్తులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనిపై శానిటేషన్ ఇన్చార్జి పర్యవేక్షకులు వరి నర్సయ్య మాట్లాడుతూ ధర్మగుండంలో బట్టలు ఉతుకకుండా ఇప్పటికే మైక్ల ద్వారా ప్రచారం చేస్తున్నాం. అయినా చాలా మంది అలాగే చేస్తున్నారు. ఇక ముందు ఎవరూ బట్టలు ఉతుకకుండా చర్యలు తీసుకుంటాం.